17, మార్చి 2017, శుక్రవారం

బ్లాగుల్లో నేనెందుకు వ్రాస్తున్నాను?

నేను డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగం వెతుక్కోవటానికి హైదరాబాద్లో ఉన్నరోజుల్లో, అప్పుడప్పుడు అఫ్జల్ గంజ్లో ఉన్న స్టేట్ లైబ్రరీకి వెళ్లి కాసేపు కాలక్షేపం చేసేవాడిని. అప్పటిదాకా చిన్నఊళ్ళల్లో ఉన్న చిన్న లైబ్రరీల్లో చదివిన నాకు, అంత పెద్ద లైబ్రరీ మొట్టమొదటిసారి చూసేటప్పటికి ఒళ్ళు స్పృహ తెలియలేదు. ప్రత్యేకంగా తెలుగు పుస్తకాలు ఒక పెద్ద గది నిండా పదో, పన్నెండో అరలలో  చక్కగా సర్దబడి కళ్ళకి చాలా ఇంపుగా వుండేవి. అప్పట్లో అరవై రూపాయలు డిపాజిట్ తీసుకొని, రెండు పుస్తకాలు రెండు మూడు వారాలుంచుకొని చదవటానికి  అద్దెకి ఇచ్చేవాళ్లు. ఆరోజుల్ని, ఆరోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలు తలచుకొంటే చాలా బెంగగా ఉంటుంది. ఆతర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లినా, అక్కడ ఇంకా ఎక్కువ పుస్తకాలు చూసిన, స్టేట్ లైబ్రరీ ఇచ్చిన ఆనందం మళ్ళీ ఆస్టిన్, టెక్సాస్ లోని లిండన్ జాన్సన్ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు చూసే దాకా రాలేదు.  చివర చెప్పిన లైబ్రరీలో సౌత్ ఈస్ట్ ఆసియాకి సంబంధించిన చాలా భాషల్లో పుస్తకాలున్నాయి. అప్పట్లో ఆదాయం ఇంకా లేనపుడు, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనడానికి చేతులు రాక, వాటి కేసి దిగులుగా చూస్తూ వెళ్లిన రోజులు (కోఠి, ఆబిడ్స్ లో ఆదివారం వీధుల మీద పుస్తకాల అమ్మకాలు చూసే ఉంటారు) ఇంకా గుర్తే.  అప్పట్లో చూసిన కొన్ని అపురూపమైన పుస్తకాలు ఇప్పుడు కొనుక్కుందామనుకొన్నా దొరకని పరిస్థితి మీలో చాలా మందికి అనుభవైక్యమే. క్రొత్త పుస్తకాల వాసన, ఎవ్వరి దగ్గర దొరకని పాత పుస్తకం మనకి దొరకడం, దానిలో ఒక్కొక్క పేజీ త్రిప్పుతూ ఆ తన్మయత్వంలో మునిగితేలటం ఇవన్నీ నోటితోనే, కాగితం మీదో చెప్పే విషయాలు కావు. అనుభవించి తెలుసుకోవలసినవి మాత్రమే. 

అప్పుడు చదివిన కొన్ని మంచి పుస్తకాలలో ఒకటి - "నేనెందుకు వ్రాస్తున్నాను" అన్న పుస్తకం. చదివి చాలా కాలం అయ్యింది. అప్పటివరకు ఉన్న కొందరు లబ్దప్రతిష్టులైన రచయితల చేత ఎడిటర్ వారెందుకు వ్రాయటం మొదలెట్టారో ఒక్కోవ్యాసం వ్రాయించి, వాటినన్నింటిని ఒక సంకలనం క్రింద ప్రచురించారు. శ్రీశ్రీ గారు, గొల్లపూడి మారుతీరావు గారు నాకు గుర్తున్న ప్రముఖులు. పుస్తకం సారాంశం ఏమిటంటే - "నీలో ఉన్న భావాలు అందరితో పంచుకోవాలి, వాటికి ఒక శాశ్వతత్వం కల్పించాలి అనుకున్నపుడు వాటికి అక్షర రూపం ఇచ్చి పుస్తకాలుగా చూడాలనుకొంటావు" - అని. ఊటలో ఉన్న జల ఆగలేక బయటికి ఎలా తన్నుకువస్తుందో అలా నీలో ఉన్న మాట, పాట  గుండెల్లో స్థిమితంగా ఉండలేక బయటకి ఉరికి రావటం అన్నమాట. ఈ రచయితలంతా వారి మొదటి పద్యం, కవిత, కథ, వ్యాసం, ఏదైనా అచ్చు వేయటానికి ఎంత శ్రమపడ్డారో , ముద్రణలో కష్టాలు, కాపీల సంఖ్య, అమ్ముకోవటంలో బాధలు, పారితోషికంతో సమస్యలు ఇలా అనేక విషయాలు చర్చించబడ్డాయి. అయితే వాటిలో ఓకే అంశాన్ని - మనం  అచ్చులో అక్షరాలని చూసుకొన్నప్పుడు కలిగే ఆనందం  -  మాత్రమే నేను స్పృజించదలచుకొన్నాను. ఈపుస్తకం మళ్ళీ ఇంకోచోటెక్కడా తారసపడలేదు. దొరికితే మాత్రం తప్పక  చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా ఔత్సాహిక రచయితలకి ఇది మంచి రిఫరెన్స్ పుస్తకం. ప్రత్యేకంగా ఒక రచయిత మాటలని మరొకళ్ళు యథాతధంగా చెప్పటం కష్టం. వారి మాటల్లోనే చదివితే పొందే అలౌకిక ఆనందం చెప్పనలవికాదు. నేను వ్రాయటానికి పైన పేర్కొన్న పెద్దల మాటలు ఒక విధంగా ప్రేరణ అయితే, మరో రకంగా వ్రాసే వాళ్ళ గుంపులో చేరాలన్న చిన్ననాటి ఉబలాటం.

పూర్వపు (ఇంటర్నెట్ లో న్యూస్ గ్రూప్స్ కూడా రాక ముందు రోజుల గురించి - ఇవేమిటో తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి) రచయితలకున్నన్ని సాధకబాధకాలు మనకిప్పుడు లేవని నేననుకొంటున్నాను. కనీసం సొంతంగా బ్లాగుల్లో ఉచితంగా వ్రాసుకోవచ్చు. యేభాషలో అయినా వ్రాసుకోవచ్చు. నచ్చితే వ్రాయవచ్చు లేదా ఊరుకోవచ్చు.  ఎవరిని అకారణంగా కించపరచకుండా (ఇది అన్ని వేళల కుదరేదేమో? కొన్ని విషయాలలో కొందరికి మోదం, మరి కొన్నింటి విషయంలో కొందరికి ఖేదం కలగడం సహజమేమో!), ఏదైనా, ఎప్పుడైనా, ఎలాగైనా వ్రాసుకోవచ్చు. పాఠకులని, ప్రచురణ కర్తలని వెతుక్కోవక్కరలేదు. డెడ్ లైన్లు లేవు, పీకల మీద కూర్చునే వాళ్ళు లేరు. అయితే మనం సరదాగా మన కోసం వ్రాసుకున్నంత సేపే. ఒకసారి లాభాపేక్షతో చేసినా, ఆదాయంకోసం చేసినా, పైన చెప్పినవేవి వర్తించవు. అలాగే తెలుగులో వ్రాతల్ని పుస్తకాలుగా మలుచుకొనేవాళ్ళకి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే అనాలి (ఈ విషయంలో అనుభవజ్ఞులు ఎవరైనా వాళ్ళ అనుభవాలు వ్రాస్తే బావుంటుంది). నాకు పదేళ్ళప్పుడు వ్రాయాలన్న పురుగు కుట్టటం మొదలు పెట్టింది. కానీ బెరుకు, బద్ధకం, భయం లాంటి ఈతిబాధలు చాలా కాలం ఇబ్బంది పెట్టాయి. చివరికి బ్లాగులు అందుబాటులోకొచ్చాక ఒక వృత్తిపరమైన బ్లాగ్ మొదలెట్టాను. వ్రాత అయితే అచ్చులోకొచ్చింది కానీ, అది పూర్తి సంతృప్తినివ్వలేదు. అది కాస్తా చాలా తక్కువ కాలంలోనే అటకఎక్కింది. ఇప్పటికి ముక్కంటి దయవల్ల అన్ని అనుకూలించి కావలసిన చోటికి వచ్చి, నాకు నచ్చినది వ్రాయటం కొంత సాధ్యమైంది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది. 

వ్రాయటం అనే వ్యాపకం, చదవటం లాగే మొట్టమొదటగా మన ఆత్మసంతృప్తి కోసం చేసే పని మాత్రమే అని నా నమ్మకం. ఆ తర్వాత వరుసలో మన భావాలు ఇతరులకి తెలియచేయటం, వారిని మన మార్గాన్ని అనుసరించమని ప్రోత్సహించటం, వారినుంచి విమర్శలను, వ్యాఖ్యలని కోరటం, క్రొత్త విషయాలు నేర్చుకోవటం  లాంటివి.  చక్కగా, పకడ్బందీగా వ్రాయటం వరకే రచయితగా మన పని,  ఆతర్వాత మళ్ళీ భవిష్యత్తులో చూసుకొంటే, ఓహో బావుంది అనుకోవటం లేదా అయ్యో సరిగ్గా వ్రాయలేకపోయానే, ఇంకా బాగా వ్రాసి ఉండొచ్చేమో అనుకోవటం కూడా బాగానేఉంటుంది. ఎక్కువ మంది చదవడం లేదు, ఎక్కువ కామెంట్లు రావటం లేదు అన్నది మీ చేతిలో లేదు. దానిగురించి చింత కూడా అనవసరం. నేను గమనించిన దాని ప్రకారం క్రమం తప్పకుండా, స్థిరంగా, బిగువుగా, సులభంగా,  సరళంగా పాఠకుల హృదయానికి దగ్గరగా ఉండేలా వ్రాసే వారికి (ముఖ్యంగా శైలి, విషయపరిజ్ఞానం, కథనం బాగా ఉంటే) పాఠకుల కొరత లేదు.  ఇక భాష మీద పట్టు, వ్రాసే విషయం మీద అధికారం ఉన్న వాళ్ళ గురించి వేరే ప్రత్యేకంగా చెప్పేదేమిలేదు. చాల మంది మేధావులు, ప్రాజ్ఞులు, అద్భుతంగా వ్రాసే వాళ్ళు బ్లాగులలో ఉన్నారు. పేరు పేరునా చెప్పటం కష్టం కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యట్లేదు. నేను మాత్రం అలాంటి వారి వద్ద నుంచి నిరంతరం స్ఫూర్తి  పొందుతూనే ఉంటాను. కొంత మంది బ్లాగ్ రచయితల వెతలు చూసి, చదువరిగా నా అనుభవంతో ఇది వ్రాయాలనిపించింది. నేనేదో పైనుంచి దిగివచ్చిన అవతారమని చెప్పుకోవటం కాదు. నాకు తెలిసినది మీతో పంచుకొని, నన్ను నేను ఉద్దరించుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. నేనెందుకు చదువుతాను అన్నది మరో సారి. 

6, మార్చి 2017, సోమవారం

కంప్యూటర్లో తెలుగులిపి రూపకర్తలు

గమనిక:
నేను చదువుకున్నది కంప్యూటర్ సైన్స్ కాదు, ఇక్కడ వ్రాసిన కొన్ని విషయాలు సమగ్రంగా ఉండక పోవచ్చు, తప్పులుండొచ్చు. కానీ సంబంధిత రంగంలో పని చేస్తుండడం వల్ల, కొంత విషయపరిజ్ఞానం ఉండటం వల్ల దీని గురించి వ్రాయదలచుకొన్నాను.  రెండవది తెలుగునాట మనకి ఇంటికి ఇద్దరైనా సాఫ్ట్ వేరు ఇంజినీరులు ఉన్నా, ఆ రంగంలో పరిశోధనల పరంగా చూస్తే మన వంతు పాత్ర చాలా తక్కువ. అలాంటిపరిశోధకులలో పేరేన్నదగిన ఒకరిద్దరు తెలుగువారిని గురించి వ్రాద్దామన్నదే ఈ ప్రయత్నం. ఒకేసమయంలో చాలామంది ఒకే సమస్యమీద ఏక కాలంలో పనిచేసి, పరిష్కారం కనిపెట్టి ఉండవచ్చు. వారందరిని నేను ఇక్కడ ప్రకటనంగా తెలియచేయక పోయినా, వారందరికి నేను కృతజ్ఞుడను (ఈవేళ తెలుగులో నేను ఇక్కడ వ్రాయటానికి వాళ్ళే కారణభూతులు). మూడవది సామాన్య పాఠకులకు వ్రాద్దామని అనుకొన్నా, క్లిష్టమైన తెలియని సంగతులతో కూడినది అవటం వల్ల అందరికి అర్థం కాకపోవచ్చు. ముఖ్యమైన మైలురాళ్ళు, అప్పుడేమి జరిగింది అన్నవాటికే ప్రాముఖ్యతనిచ్చాను. చాలా పదాలు సాంకేతికమైనవి కనుక ఇంగ్లీషులోనే ఉంచేసాను. 



ఇక కథలోకి.... 
కంప్యూటర్ రంగంలో ట్యూరింగ్ అవార్డు అన్నది భౌతిక, రసాయన శాస్త్రాల లాంటి మిగిలిన రంగాల్లో ఇచ్చే నోబెల్ ప్రైజ్ లాంటిది. ఆ బహుమానం 1974లో తీసుకొన్న ప్రముఖుడు డోనాల్డ్ నూత్ (Donald Knuth - DK గారి సొంత సైట్ లింక్). ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో  విశ్రాంత అధ్యాపకులు. ఆయన తర్వాత 20 ఏళ్ళకి మన తెలుగు వారైన రాజిరెడ్డిగారు 1994 లో అందుకొన్నారు. మిగిలిన అవార్డు గ్రహీతలను చూడాలనుకొంటే ఇక్కడ నొక్కండి. రాజిరెడ్డిగారి గురించి, ఆయన కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI - artificial intelligence) మీద చేసిన పరిశోధనలు, ఆయనని విజిటింగ్ ప్రొఫెసర్ క్రింద మన ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కి రప్పించటం వార్తల్లో చాలామందే చదివివుంటారు. ఇక్కడ నేను వ్రాసే విషయవస్తువు కోసం DK గారి కృషికి మాత్రం పరిమితమవుతాను. 

టెక్ (TeX) అన్న టైప్ సెట్టింగ్ కంప్యూటర్ భాషను తయారు చేసింది DK గారు. దీన్ని  కంప్యూటర్లో రకరకాల ఫాంట్లని వివిధ రకాల ఆకృతుల్లో తయారుచేయటానికి వాడతారు. అలాగే లేసర్ ప్రింటర్స్ లో ప్రింట్ చేసేటప్పుడు డాటాను ఒక ప్రత్యేక పద్దతిలో (postscript రూపంలో) ప్రింటర్ కి పంపుతారు. దానికి కావలసిన సాంకేతికతని కూడా DK గారే తయారుచేశారు. వీటన్నింటిని కలిపి ది ఆర్ట్ అఫ్ కంప్యూటర్ ప్రోగామ్మింగ్ అని నాలుగు సంపుటాలు వ్రాసారు. వీటిని కంప్యూటర్ రంగంలో ఉన్న చాలా మంది భగవద్గీత క్రింద పరిగణిస్తారు. 1990లలో యూనివర్సిటీలలో వీటిని పాఠ్యపుస్తకాలుగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వాడేవాళ్లు. అప్పటికి వేరే భాషల్లో వ్రాయటానికి, లెక్కలకి,  పరిశోధనపత్రాలకి సంబందించిన సింబల్సు కంప్యూటర్లో వ్రాయటానికి వీలయ్యేది కాదు. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉన్నాకూడా దానితో అన్ని వీలయ్యేవికాదు, లేదా అది చాలా ఖరీదుండడంచేత ఎక్కువ మంది వాడేవాళ్లు కాదు. అందువల్ల TeXని ఆధారం చేసుకొని LaTeX అని మరో డాక్యుమెంట్ రైటింగ్ సిస్టం కనిపెట్టారు. ఇది ఎక్కువ భాగం సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళు, పరిశోధన విద్యార్థులు వాడుకుంటుండేవాళ్లు. 1991లో లక్ష్మి ముక్కవిల్లి గారు TeluguTeX అనే LaTeX ని పోలిన తెలుగు సాఫ్ట్వేర్ తయారుచేశారు, కానీ దీన్ని వాడటానికి కూడా కొంత సాంకేతిక నైపుణ్యం అవసరం ఉండేది. 

ఈ పూర్వరంగం సంగతులు మీకు చెప్పడానికి చాలా కారణాలున్నాయి. 1990లలోనే అవినాష్ చోప్డే అన్న ఆయన భారతీయ భాషల్ని కంప్యూటర్లో వ్రాయడానికి ITRANS అన్న సిస్టం తయారుచేశారు, ముఖ్యంగా ఆ రోజుల్లో హిందీ పాటల సాహిత్యం దీని సహాయంతో వ్రాసి ఇంటర్నెట్లో పంచుకొనే వాళ్ళ సంఖ్య వందల్లో ఉండేది.  మన కథానాయకులు రంగంలోకి వచ్చేటప్పటికి ఇవి పరిస్థితులు. ఇంచుమించుగా ఇదే సమయంలో తెలుగులో ఈవిధంగా వ్రాయటాన్ని అందుబాటులోకి తెచ్చిన వాళ్ళు శ్రీయుతులు రామరావు కన్నెగంటి (RK - రామ గారి లింక్ ), ఆనంద కిశోర్ (AR), రమణ జువ్వాది (RJ - రమణగారి బ్లాగ్ లింక్). వీళ్లు  రైస్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు, వాళ్ళ పరిశోధనలో భాగంగా దీన్ని తయారుచేసినట్టు, చదివిన యూనివర్సిటీ మీద ప్రేమతో వాళ్ళు కనిపెట్టిన సిస్టం ఆపేరు పెట్టినట్టు అప్పట్లో చదివాను. చిత్రంగా వీరి గురించి అప్పట్లో చదివిన వ్యాసాలేవి ఇంటర్నెట్లో అందుబాటులో లేవు. ఇంగ్లిష్ అక్షరాల సహాయంతో తెలుగులో వ్రాయటమన్నది రైస్ ట్రాన్స్లిటరేషన్ సిస్టం (Rice Transliteration System) తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అన్నది నిస్సందేహం.  ఇది కూడా మొదట్లో యూనివర్సిటీలలో, పెద్ద కంప్యూటర్ కంపెనీలలో, పరిశోధనలో ఉన్న తెలుగు వాళ్ళు వాడేవాళ్లు.  పైనిచ్చిన లింకుని అనుసరిస్తే, RTS తాలూకు వివరాలు దొరుకుతాయి. చాల కాలం అంటే లేఖిని తయారయ్యేదాకా చాలామంది దీని సాయంతోనే న్యూస్ గ్రూప్స్ లో తెలుగు వ్రాసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో  ఇంటర్నెట్ మీద, డెస్క్టాప్ మీద తెలుగు కోసం చాలా టూల్స్ వచ్చినా ఇది బాగా మనస్సులో నిలిచిపోయింది. వారి వారి రంగాలలో అత్యున్నత స్థాయికి  చేరటమే కాకుండా, తెలుగును  కంప్యూటర్లో వ్రాయటం విస్తృతంగా వ్యాప్తినొందడానికి పునాదిరాయి వేసి, ఔత్సాహిక రచయితలకి మార్గం సుగమం చేసిన వీరి కృషిని తెలుగు వారంతా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

పైన ఇచ్చినవి కాకుండా RTS గురించిన మరో వ్యాసం సౌమ్య గారి బ్లాగ్లో చూడొచ్చు.  మరో ఉపయోగకరమైన లంకె.