11, మే 2017, గురువారం

రావిశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, గాంధీ గార్ల సారుప్యం

రావిశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, గాంధీ - వీళ్ళ పేర్లు తెలియని తెలుగు వాళ్లుంటారని నేననుకోను. ఒక వేళ తెలియకపోతే తెలుసుకోవడం ఈ రోజుల్లో అంత కష్టం కాదు. క్లుప్తంగా.....

రావిశాస్త్రి - రాచకొండ విశ్వనాథశాస్త్రి  - రచయిత, న్యాయవాది, వామభావపక్షవాది.
శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాసరావు -  కవి, రచయిత, వామభావపక్షవాది, విరసం స్థాపకులలో ఒకరు.
విశ్వనాథ - విశ్వనాథ సత్యనారాయణ -  కవి, రచయిత, మొదటి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, ఉపాధ్యాయుడు.
గాంధీ - మోహనదాస్ కరంచంద్ గాంధీ - భారత జాతిపిత,  రచయిత, న్యాయవాది.

మొదటి ముగ్గురు తెలుగువాళ్లయితే, చివరి ఆయన గుజరాతీ. మొదటి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీశ్రీ, విశ్వనాథ గార్లకి ఒకరంటే మరొకరికి గొప్ప అభిమానం, గౌరవం ఉండేవి.  ఒకళ్ళ కవిత్వంతో  మరొకరిని ఉత్సాహపరచి, ఉద్రేకపరచి క్రొత్త రచనలను చేసే విధంగా ప్రోత్సహించి మనలని అలరించిన వారే. వీరంతా రచనావ్యాసంగంలో చేయి తిరిగిన వారే. అందరు ప్రజల కోసం సొంత లాభం వదిలిపెట్టి నిస్వార్థంగా సేవ చేసిన వారే. ఎవరికి వారు అశేష ప్రజల అభిమానాన్ని, ఎందరో పాఠకుల ఆదరణని పొందిన వారే. వాళ్ళ సమకాలీకుల దగ్గర నుంచి ఎక్కువ విమర్శలని, తక్కువ ఆదరణని పొందిన వారే.

ఇంత చేసి వాళ్లెవరు నాకు తెలిసి వ్యక్తిగతంగా చెడ్డ వారు కాదు. వారి గురించిన పరిచయ వాక్యాలు కూడా కొంత మందికి కోపం తెప్పించవచ్చు. అయితే నాకు తెలిసినదేమిటి అన్న ప్రశ్న వస్తుంది. అందులోకే వస్తున్నాను. వారు నాకు వారి రచనల ద్వారానే పరిచయం. అన్ని రచనలు చదివాను అని చెప్పను కానీ చదివిన మేరకు వాళ్ళ గురించి ఒక అంచనాకి వచ్చాను. కవి సహజంగా ప్రజాబంధువయిఉంటాడు, వాళ్లకున్న సమస్యలను కష్టాలను చూసి స్పందించి రచనలు చేస్తాడు. అందువల్ల పైపెద్దలంతా ప్రజలకి ఎంతో కొంత ప్రయోజనం ఒనగూర్చే పనులే చేశారు కానీ, ప్రజాకంటకమైన పనులేమీ చెయ్యలేదు. వాళ్ళు ఆశించిన ప్రయోజనం రాకపోయినా వాళ్ళ ప్రయత్న లోపం ఎంత మాత్రం లేదు. అందరు ధృడ సంకల్పం, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారు, లేకపోతే సమాజం వారిపట్ల ప్రవర్తించిన తీరుకి  వాళ్ళు ఏనాడో చెల్లాచెదురయ్యేవాళ్ళు, జనం గుండెల్లో ఇంత కాలం చోటు చేసుకోవటం కల్ల. ఈ భాగం వాళ్ళ ప్రజాజీవితంకి సంబంధించినది మాత్రమే.

రావిశాస్త్రి గారికి బంధువయినా ఒక ఆవిడ అన్నదాని ప్రకారం ఆయన తాగుడు, పరస్త్రీ వ్యసనాల వల్ల ఆయన కుటుంబం నానా అవస్థలు పడిందని. అలాగే శ్రీశ్రీ గారి వ్యసనాల వల్ల ఆయన భార్యలు సుఖపడినట్టు నాకనిపించలేదు. విశ్వనాథ వారు తనకి ఉన్నా లేకపోయినా అందరికి దానాలిచ్చి మొత్తం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని, ఇంట్లో ఆడవారిని సరిగ్గా చూడలేదని వారి కుటుంబంతో పరిచయమున్న ఒకావిడ చెప్పారు. గాంధీ గారి ప్రజాసేవ వల్ల ఆయన పిల్లలు ఎవరూ ఆయనని ఆదరించలేదన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ వారి వ్యక్తిగత జీవితాలు అయినా అందరికి బహిర్గతమయిన నిజాలే.

ఇంట గెలిచి రచ్చ గెలవమని ఒక నానుడి. పైన చెప్పిన వాళ్ళందరికి వారి వారి కర్తవ్యం, విద్యుక్త ధర్మం తెలియకపోవడం అన్న సమస్యే లేదు. మరి కుటుంబాన్ని వదిలి, దేశసేవ మీద దృష్టి పెట్టటంలో ఉద్దేశం ఏమిటి? సగటు మనుషులుగా మనం వారి ఔన్నత్యాన్ని ప్రక్కనపెట్టి వారి బలహీనతలను రచ్చకెక్కించటం సబబేనా? వాటిని మాత్రమే పరిగణించి, మనం కూడా వారు చేశారు కాబట్టి మేము చేస్తున్నాము అనటం అందమా? లేక వారు చేసిన సేవల ఫలితంగా వాటిని మాత్రమే చూసి మిగిలిన వాటిని తిరస్కరించాలా? కాలేజీ రోజుల్లో వీటి మీద గంటలు గంటలు చర్చలు చేసే వాళ్ళం. వాటిల్లో మేము చేసిన తీర్మానాలు మాత్రం అడక్కండి.