7, మార్చి 2019, గురువారం

ఏడవటం నా జన్మహక్కు

పిల్లవాడు పుట్టి పుట్టగానే ఏడవకపోతే, గిల్లి ఏడ్పించేవారు. ఇప్పటికి ఇది ఆచరణలో ఉన్న వ్యవహారమే. ఇది శిశువు ఆరోగ్యంగా పుట్టాడా లేదా అని తెలుకోవడానికి చేసేవాళ్ళు. క్రమేణా వాడు పెద్దవాడయ్యే క్రమంలో ఏడుస్తూ, నవ్వుతూ ఇవి రెండు కాకుండా బ్రహ్మనందాన్ని ఎలా పొందాలి అన్న దిశగా ప్రయాణం చేస్తాడు అని ఆశించేవారు. కాస్త విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా బ్రతకాలని, లేకపోతే అధమం సంతోషంగా అయినా ఉండాలని కోరుకుంటారు. కనీసం గతంలో ఇలా జరిగేదని మనకున్న వాఙ్మయం చెబుతోంది. మారుతున్న పర్యావరణం, కాలంతో పాటు మనిషి పెడబుద్ధి కూడా రూపాంతరం చెందుతున్నట్టు అనిపిస్తుంది. మార్పు సహజము లేదా సహజమైన మార్పుని ఆహ్వానించవలసిందే.  కానీ అవాంఛితమైన మార్పు, విపరీత ధోరణులు ఎవరికి అభిలషణీయం కాదు.

నేను మాట్లాడుతున్న అసహజమైన మార్పు "ఏడుపు" గురించి. ఏదో బాధ, ఒక దుఃఖం కలిగించే సంఘటనో, అనారోగ్యం, దగ్గర మనుషులలో లేక వాళ్ళతో అశాంతి ఉండి, ఎవరైనా ఏడిస్తే అది అత్యంత సహజం. అటువంటి వాళ్లకి ఓదార్పు మాటలు చెప్పటమో,  సానుభూతి చెయ్యటమో, మనకి చేతనయినా సాయం ఏదైనా చేయటానికి ప్రయత్నం చేస్తాం. కానీ అయినదానికీ, కానీదానికి ఏడుపు అనే భావప్రకటన చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. నన్ను తిట్టావు ఏడుస్తాను, మా హీరోని తిట్టావు ఏడుస్తాను, మా నాయకుడిని తిట్టావు ఏడుస్తాను. నువ్వు నాకంటే బాగా చదువుతావు ఏడుస్తాను, నువ్వు నాకంటే బాగా వ్రాస్తావు ఏడుస్తాను, నువ్వు నాకంటే అందగాడివి ఏడుస్తాను, నువ్వు నాకంటే బాగా పాడతావు ఏడుస్తాను. అంటే సమస్య ఏదైనా, నచ్చనిది ఏది కనిపించినా సమాధానం ఏడుపే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ధోరణి ఇంకా ఎక్కువగా ఉంది. నాకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంది, నామాట సులభంగా అందరికి చేరుతుంది కదా అని ఏదైనా అంటాను అన్న దృక్పథం మెండయింది. అంటే ఈతరహా జనాలకి ఏడవటం జన్మహక్కు అయికూర్చుంది. 

పూర్వం పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దలు దండించేవాళ్లు. ఇందులో విశేషం ఏమిటంటే పెద్దలు ఎవరైనా  కావచ్చు. తల్లితండ్రులు, ఇరుగు పొరుగు, గురువులు, ఊళ్ళో పెద్దలు ఇలాంటి వాళ్లు అన్న మాట.  ఈవిషయంలో మాఇంట్లో వాళ్ళు ఇంకాస్త ముందుకెళ్ళి మాగురించి (పిల్లలం) ఏ ఫిర్యాదు వచ్చినా ముందు మమ్మల్ని దండించి తర్వాత ఏమి జరిగింది అన్నది విచారణ చేసేవాళ్ళు. మాకు ఉక్రోశం,ఎంత బాధ కలిగినా అసలు అటువంటి పరిస్థితిలో ఇరుక్కునందుకు మమ్మల్ని మేమే నిందించుకొని ఊరుకొనేవాళ్ళము. ఒక్కొక్కసారి పిల్లవాడికి సంబంధం లేకపోయినా కొట్టవలసి వచ్చిందని పెద్దలు నొచ్చుకొనేవారేమో! ఇలా ఎందుకు చేసేవారో పెద్దయిన తర్వాత కానీ మాకు అవగాహనలోకి రాలేదు. అంటే చెడు ఆలోచనని ఆదిలోనే త్రుంచేయ్యాలి అన్నది అప్పటి పెద్దల తపన, దానికి అనుగుణంగానే పిల్లలు వృద్ధిలోకి వచ్చారు. సంపాదనలు విపరీతంగా లేకపోయినా, భయం భక్తి ఉండి సంఘవిద్రోహులు కాకుండా మిగలగలిగారు. కానీ పరిస్థితులు ఎంతగా మారిపోయాయి అంటే మొత్తం పద్ధతులన్నీ తలక్రిందులయ్యాయి.

ఎవరు ఇంకొకరిని ఏమి అనటానికి లేదు. పెద్ద చిన్న, మంచి చెడు విచక్షణ లేదు. చెప్పేవాళ్ళు తగ్గారు, చెబితే విని ఆచరణలో పెట్టె వాళ్ళు తగ్గారు. ఇప్పుడు అన్నిచోట్లా మంచి చెప్పటం కూడా తప్పే. మేష్టారుగారు పిల్లవాణ్ని తిట్టినా, దండించిన ఆయనకే అక్షింతలు. కొన్ని చోట్ల కేసులు, ఉద్యోగం ఊడపీకడం, మరికొన్ని చోట్ల తల్లితండ్రులో బందుగులో చేయి చేసుకోవటం, జైళ్ల పాలు కావటం, సంసారాలు విచ్చిన్నం కావటం తరచూ జరుగుతోంది. పశ్చిమ దేశాల పద్ధతులు యెంత మాత్రం అర్థం చేసుకోకుండా దిగుమతి చేసుకుని అమలు చేయటం ఎక్కువ అయిపొయింది. అందరి హక్కులు కాపాడాలి అని బాధ్యతలకు, కర్తవ్యాలకి తిలోదకాలు ఇచ్చేసాము. న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, ఇతర ఉన్నత సంస్థలు "మంచిని చెయ్యి" అని చెప్పే నైతికతని నెమ్మదిగా కోల్పోతున్నారు.  అంటే అంతా పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అనుకొంటే అది కూడా తప్పే.

ఇంతకీ ఏడుపు దగ్గర మొదలెట్టా కదా! దేశభక్తి, నైతికత, నాయకత్వం, సమర్థత, సమభావన, కర్తవ్యదీక్ష కలిగిన వ్యక్తులు ఇంకా భారత భూమిలో పుష్కలంగా ఉన్నారు. పేర్లు కావాలనే చెప్పట్లేదు. అవసరం కూడా లేదు. ఇప్పటి తరంలో మీకు కనిపించక పోతే బాగా వెతకండి. వాళ్ళు మన మధ్యనే సామాన్యుల్లా బ్రతుకుతున్నారు. మన సమకాలీకులని, గొప్పవారిని ఎలాగూ గుర్తించము కనక, కనీసం మన ముందు తరాల్లో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాము. మన జీవితాలని ఉద్దీపనం చేసుకుందాము. అసలైన, సరైన సమస్యలను ఎదుర్కొనే, పోరాడే శక్తిని ఇవ్వమని ఏడుద్దాము, ప్రార్థిద్దాం. అక్కరలేని, మనకు సంబంధం లేని వాటి జోలికి వెళ్ళవద్దు. అంతేకాని మంచి చెప్పే ఉన్నతమైన వ్యక్తులని చూసి ఏడవటం, వాళ్ళని ఏడిపించటం మానేద్దాము. వాళ్ళు చెప్పినది మనకి నచ్చకపోతే మౌనంగా ఉందాము అంతే కానీ ఏడిస్తే అది మనకి సాయం చేయకపోగా అనారోగ్యం పాలుచేస్తుంది అన్నది గ్రహిద్దాము.

మంచిని ప్రోత్సహిద్దాము, అది చెప్పే పెద్దలని గౌరవిద్దాము, తద్వారా మనల్ని గౌరవించుకొందాం, వారి ద్వారా అందరు కోరుకొనే గొప్ప సమాజాన్ని నిర్మించుకొందాము. సర్వేజనా సుఖినోభవంతు!!!

తోక:- ఈమధ్యన ఒక పెద్దమనిషిని మరో అణువంతమనిషి అనకూడని మాటలనటం నా ఏడుపుకి కారణం. 

24, అక్టోబర్ 2018, బుధవారం

వాట్సాప్ సిత్రాలు


మనలో చాల మంది ప్రొద్దునే నిద్రలేచి ముఖం కడుక్కోకుండా, మొట్టమొదట సెల్ ఫోన్ చూసేవాళ్ళు ఎంత మంది?  వాళ్లలో వాట్సాప్ చూసే వాళ్ళు ఎంత మంది? నేననుకోవటం కనీసం ఒక 95 శాతం ఫోన్ చూస్తే, వాళ్ళల్లో ఒక 95 శాతం వాట్సాప్ (whatsapp) మొదట చూస్తారని. వీళ్ళలో అందరికి కనీసం ఒకటో రెండో గ్రూపుల్లో సభ్యత్వం ఉంటుంది. ప్రొద్దున్నే చూడటం మంచి పనా లేక చెడ్డదా అన్నది కాదు ప్రశ్న. నా ప్రశ్నల్లా  ఏమిటంటే ఇది ఏరకంగా మనకి ఉపకరిస్తోంది అన్నది. 

వాట్సాప్ లో వచ్చే వార్తలని స్థూలంగా ఈక్రింది విభాగాలుగా చూడొచ్చు.  వచ్చే వార్తలన్నీ వీడియోలు, ఆడియోలు, యానిమేషన్లు, సంభాషణలు, సూక్తి ముక్తావళి, వీటిల్లో ఏదైనా కావచ్చు. 

జోక్స్ :
వీటితో ఎవరికి పేచీ లేదు. యేవో కొన్ని సున్నితమైన విషయాలకి సంబంధించినవి మినహాయిస్తే, వీటిని అందరు ఆస్వాదిస్తారేమో. 

దైవ భక్తి:
ఇది కూడా వ్యక్తిగతం కాబట్టి ఎక్కువ భాగం ఇబ్బంది లేదు. ఒకరి దేవుడి మీద ఇంకోడు హాస్యం, బురద చల్లనంత కాలం, లేకపోతే మన అభిప్రాయాలు బలవంతంగా రుద్ధనంత కాలం ఇది బాగానే నడుస్తుంది. లేకపోతే ఎక్కువ పరమత సహనం ఉన్నట్టు నటించవలసి ఉంటుంది. 

దేశభక్తి:
ఒకానొకప్పుడు ఎక్కువ మంది బయటకి చెప్పే అవసరం లేకుండానే దేశభక్తితో రగిలిపోయేవాళ్లు. నిజాయతి ఉన్న ఒక గొప్ప నాయకుడు "జై జవాన్, జై కిసాన్" అని పిలుపిస్తే లక్షల మంది వారితో మమేకమయ్యేరు. ఇప్పుడిది పైకి చెప్పుకోవలిసిన ఫాషన్, సోషల్ మీడియాలో చక్కగా వండబడుతున్న పదార్థం.  

ఆటలు /సాహసాలు: 
సోషల్ మీడియా పుణ్యామా అని క్రికెట్ కాకుండా వేరే క్రీడలు, ఇతర వ్యాసంగాలలో ప్రావీణ్యం చూపుతున్న ఆటగాళ్లు, పోటుగాళ్ళు గుర్తింపు పొందుతున్నారు. వాళ్లకి కూడా స్పాన్సర్స్ దొరుకుతున్నారు, జీవనోపాధి దొరుకుతోంది. చాలా సంతోషించవలసిన విషయం. 

సినిమాలు:
తెలుగు వాళ్ళకి సినిమా, రాజకీయాలు బాగా వంటపట్టాయి అందుకని ఇవి లైట్ తీసుకోవచ్చు. కాకపోతే మీము (meme), దుబ్స్మాషు (dubsmash), అర్థం లేని వీడియోల వల్ల అభిమాన నాయ(కుల) సంఘాల వాళ్ళు దెబ్బలాడుకోవటానికి మరో చక్కటి అవకాశం దొరుకుతోంది. సినిమా ఔత్సాహికులకు, ప్రతిభ ఉండి డబ్బులు లేనివారికి మంచి ప్రోత్సాహం కూడా దొరుకుతోంది. 

కళలు: 
ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు అన్న అపప్రథకి గురైన ఈ రంగం ఇప్పుడు కొంచెం కొంచెం పుంజుకొంటోంది. ప్రచారం, గుర్తింపు దొరికి, చాల చిన్న చిన్న కళాకారులు కూడా విదేశాల ప్రయాణాలు చేసి వారి వారి సత్తాని, వ్యాపారాలని వృద్ధి చేసుకొంటున్నారు. 

పరోపకారం/బోధ: 
ఫలానా వారికి ఆరోగ్యం బాగోలేదు సాయం చేయండి. ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాము, విరాళాలు ఇవ్వండి. నిజంగా ఎంతమంది వీటిలో చిత్తశుద్ధితో చేస్తున్నారో, నిజమైన ఆర్తులకి ఇవి అందుతున్నాయో లేదో చెప్పటం కష్టం. ఈ పని చెయ్యండి, ఫలానా ఫలం దొరుకుతుంది అనే వాళ్ళు బాగానే ఉన్నారు. 

రాజకీయాలు: 
మనం ఎన్ని రకాలుగా చీలిపోవాలో అన్ని రకాలుగానూ చీలిపోయాం కాబట్టి, మన దాస్యభక్తి ప్రకటించుకోవడానికి ఇది అన్నిటిలోకి ముఖ్యమైనది. మర్యాదకోసం నోరు విప్పం, విప్పామో ముఠా గొడవలకి అంతు లేదు. అలాగే ప్రచార కండూతి ఉన్నవాళ్ళకిది వాళ్ళని ప్రకటించుకోవటానికి ఇదొక మంచి మార్గం. 

అభినందనలు: 
పుట్టిన రోజు, పండగ రోజు అభినందనలు  చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ లేచినపుడొకటి, తినేటప్పుడొకటి, పాడుకొనేటప్పుడొకటి మెసేజ్లు (messages) అవసరం లేదేమో.

విజ్ఞానం:
వాట్సాప్ గూగుల్ తర్వాత ఎక్కువ కష్టపడకుండా విజ్ఞానం పంచె సాధనంగా తయారయ్యింది. ఒకవేళ మీకు వాట్సాప్ లో సభ్యత్వం లేకపోతే ఈ ఒక్క కారణానికి సభ్యుడుగా చేరి పోవచ్చు. అతి తక్కువకాలంలో అన్ని శాస్త్రాలలో అఖండమైన విజ్ఞానం మీ సొంతం అవుతుంది.  

వ్యాపారం:
పేరుకి జనులనుద్దరించడానికి ఉద్భవించాము అని చెప్పుకుని, నిజానికి వ్యాపారం కోసం మాత్రమే వచ్చినవి ఈ ఉత్పత్తుల, సేవల సంస్థలు అన్ని. ఇందులో సందేహం ఏమాత్రము లేదు. మనం ఏది చేసినా, దాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పి వాళ్ళ వ్యాపారాలకు, స్వప్రయోజనాలకు అనుగుణంగా వాడుకొనే సంస్థలు అనేకం. 

ఆరోగ్య చిట్కాలు:
రోజు ప్రొద్దున్నే పరగడుపున ఒక లీటర్ గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. మీకున్న సమస్త రోగాలు మాయమవుతాయి అన్న వార్త మీలో చాలా మంది చూసే ఉంటారు. ఇదే జరిగుంటే, ప్రజలంతా రోగరహితంగా ఉండి ఆసుపత్రులు మందుల కంపెనీలు జండా ఎత్తేసేవి.  

సోషల్ మీడియా ఆవిర్భావం తర్వాత చాలా మంచి జరిగింది అనే ఒప్పుకోవాలి. 90వ దశకానికి ముందర స్కూళ్ళకి వెళ్లిన వాళ్ళకి, ఎన్నో ఏళ్ళ తర్వాత అనేకమంది స్నేహితులు, బంధువులు దూరంతో సంబంధం  లేకుండా కలిసి, ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకునే వేదిక దొరికింది. అయితే ఉన్న వసతులని ఏదో విధంగా దుర్వినియోగం  చేసే వాళ్ళు రోజు రోజుకి పెరగడమే కానీ తగ్గడం లేదు. సొంతంగా ఒక్క అభిప్రాయము, మాట వ్రాయనివాళ్ళు ఒక రోజులో కొన్ని పదుల మెసేజ్లు (messages) ఫార్వర్డ్ చేస్తున్నారు. పోనీ వాటిలో ఏవైనా వాళ్ళని కదిలించిన, వాళ్ళల్లో భావావేశం, పొంగు తెచ్చి, ఉత్తేజాన్ని నింపే వార్తలు పంపుతున్నారా అంటే అది కూడా కాదు.  అంటే వాళ్ళకి పనికిరాని వార్త మరొకళ్ళకి  పనికివస్తుంది అని కళ్ళుమూసుకొని పంపించేస్తున్నారు. దీని వల్ల ఇంటర్నెట్ మీద ఎంత రద్దీ, ఎంత భారం పడుతోందో, మనం ఎంత డిజిటల్ చెత్త (spam)తయారుచేస్తున్నామో అర్థం కావట్లేదు. అలాగే ఈవ్యర్థాల వల్ల బ్యాండ్విడ్త్ (bandwidth) తగ్గి, నిజమైన అవసరార్థులకి ఎంత అసౌకర్యం కలుగుతుందో ఎవరికి పట్టదు. పనిలో పని ఏ వార్తలు వాళ్ళకి వస్తున్నాయో సరిగ్గా చూడని, చదవని వాళ్ళు, పంపినవే మళ్లీ, మళ్లీ  పంపటం ఒక గొప్ప ఫార్స్. తప్పులు చేసే వాళ్ళు, వాళ్ళని దిద్దేవాళ్ళు, భాషతో భయపెట్టేవాళ్ళు, తప్పుడు వార్తలతో, పుకార్లతో, అబద్దాలతో శోభిల్లే ఇదో వింత ప్రపంచం. వినోదానికి తప్ప మారేందుకు పనికిరాదేమో అని ఒక్కొక్కసారి నిరాశ కలుగుతుంది. ఇంక సెల్ ఫోన్తో జీవితంలో వ్యక్తిగత అభివృద్ధి, బంధాలని తగ్గించుకొని/కోల్పోయి, పిచ్చి పనులు చేసి, కూడని పరిస్థితులలోకి చివరికి జీవితాలు నెట్టబడటం రోజు పత్రికలూ, టీవీ, ఇతర మీడియా సాధనాలు వాడే/చూసే వాళ్ళకి చెప్పనక్కరలేదు!


15, జూన్ 2018, శుక్రవారం

చిక్కటి బెంగ


చిక్కటి బెంగ - ఇదేమి పదం,  వీడి అసాధ్యం కూల అని నవ్వుకోకండి. Nostalgia అన్న ఆంగ్లపదానికి వచ్చిన చిక్కిది. పైన ఉన్న బొమ్మలో కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, కానీ నాకవేవి నచ్చలేదు. అందుకని నాకు నచ్చిన అర్థంతో రెండు పదాలని కలిపి నాక్కావలసింది తయారుచేసుకున్నాను.  మనలో చాలా మందికి బాల్యం లోని మధురస్మృతులు తలుచుకొంటుంటే మనస్సులో ఎక్కడో తీయటి (ఇదెంటో తెలియాలంటే దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచన - కృష్ణపక్షం చూడండి) బాధ కలుగుతుంది. ఇదేదో బాగానే ఉన్నట్టుంది.  Nostalgia కి తీయటి బాధకి  ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్టుంది.  ముఖ్యంగా ప్రవాసంలో ఉన్నవాళ్ళకి కష్టేఫలి గురువు గారు వ్రాసే వంటకాల స్పెషల్స్ చూసినపుడు, లేకపోతే ఫణిబాబు గారి యాత్ర విశేషాలు చూసినపుడు ఇవన్నీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో లేవే అన్ననైరాశ్యం కలుగుతుంది (ఈ పెద్దలిద్దరు మన్నించాలి అడక్కుండా వారి పేర్లు వాడుకొన్నందుకు - అలాగే వారు విద్వత్తు కలిగి అన్ని కళలలో ఆరితేరినవారు, వీటికి మాత్రమే పరిమితం కాదని గమనించాలి). అత్యాశ కాదు కానీ నాలాంటి ప్రవాస మందమతులకి తిండి మీద, తిరుగుడు మీద శ్రద్ద ఎక్కువ అందుకని వాటిగురించే ఎక్కువ ఆలోచనలొస్తుంటాయి. గాంధీగారిలాంటి మహాత్ములకైతే ప్రవాసంలో తెల్లవాళ్లు పెట్టిన బాధలు మన దేశానికి స్వతంత్రం ఎలా తేవాలి అన్న దాని మీద ఆసక్తిని పురిగొల్పాయి. సరే దారి తప్పిపోతున్నట్టున్నాను. 

చిన్నతనంలో ఏడాదికి రెండు మూడు సార్లు మా అమ్మమ్మగారింటికి సెలవులలో తణుకు వెడుతూవుండేవాళ్ళము. సాధారణంగా మాఅమ్మగారు, మాతమ్ముడు, చెల్లెలు తో కలిసి ప్రయాణం చేసేవాళ్ళము. కాస్త పెద్దవాళ్ళమైన తర్వాత, నేను మాతమ్ముడు కలిసి వెడుతూ ఉండేవాళ్ళము. మానాన్నగారికి సెలవులు లేకపోటంవల్ల , లేకపోతే అత్తగారింట్లో తోచదనో మాతో వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.  ఎక్కడా  బండి మారి వేరే బండిలో వెళ్ళక్కరలేదు కాబట్టి, ఎక్కువ భాగం సర్కారు ఎక్స్ప్రెస్లోనే ప్రయాణం చేసేవాళ్ళము.  పేరుకి ఎక్స్ప్రెస్స్ బండే కానీ ప్యాసింజర్ బండి కంటే నెమ్మదిగా వెళ్ళేది. అన్ని స్టేషన్లలోనూ గూడ్స్ రైళ్ల కోసమో, ఇంకా పెద్ద ఎక్స్ప్రెస్స్ రైళ్ల కోసం ఎక్కడో అక్కడా మధ్యలో  ఆపేసేవాళ్ళు. మధ్యాహ్నము 2 గంటలకి రైలు మా ఊళ్ళో ఎక్కితే, తెల్లారగట్ట 2 గంటలకి తణుకు చేరుకొనేది. మాఊరినుంచి బెజవాడ దాకా మెయిన్ లైన్ డబుల్ లైన్, మధ్యలో తెనాలి - గుంటూరు - విజయవాడ బ్రాంచ్ లైను, అక్కడి నుంచి కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు మీదుగా నిడదవోలు దాకా బ్రాంచ్ లైన్, పైపెచ్చు ఒకటే లైను.  మద్రాసు నుంచి కాకినాడ దాకా పూర్తిగా స్టీమ్ ఇంజిన్ తోనే రైలు నడిచేది. 1981 దాకా విజయవాడ మద్రాసు మధ్యలో, మెయిన్ లైన్లో ఎలక్ట్రిక్ రైళ్లు రాలేదు. అందువల్ల జనాలకి తొందరలేక ఎక్కువ భాగం మెల్లగా, నిదానంగా ప్రయాణాలు చేసేవాళ్లు. హడావిడి చేసేవాళ్ళు ఎలాగూ ఎప్పుడూ ఎంతో కొంత మంది ఉండడం సహజమే కదా!

పండగ సెలవలైనా, వేసవి సెలవులైనా తణుకు వెళుతున్నాము అంటే అందరికి ఉత్సాహం ఎక్కువై, పది రోజుల ముందరి నుంచే స్కూల్లో అందరికి చెప్పేసే వాళ్ళము. ఇంక దీపావళికి అక్కడికి వెడుతున్నామంటే మమ్మల్ని పట్టుకోవటం ఎవరితరం కాదు. టీచర్లు కూడా ఇచ్చిన సెలవుల కంటే కాస్త ఎక్కువ కాలం స్కూలికి రాకపోయినా ఇబ్బంది పెట్టేవాళ్లు కాదు. అందువల్ల ఇచ్చిన సెలవల కంటే ఒక్కోసారి ముందరెళ్ళడం, లేదా ఆలస్యంగా రావటం జరిగేది.  అదృష్టం బావుండి, మేము చదువుకున్నవి ప్రభుత్వపు బళ్ళు, మాకు చదువు చెప్పిన వాళ్ళు మార్కుల కోసం, ర్యాంకుల కోసం మమ్మల్ని రుబ్బని సహృదయులు. ఎల్కేజీ నుంచి బడికి నిత్యం రాకపోతే ఫెయిల్ చేస్తాము లేకపోతె విద్యార్థి ప్రగతి పొందడు అని భయపెట్టేవాళ్ళు కాదు. ఈ పెద్దల గురించి మరో సమయంలో వ్రాసే అదృష్టం భగవంతుడిచ్చుగాక!

మాకు ఒక దొడ్డమ్మ, ఒక పిన్ని, వాళ్ళకి వరసగా ముగ్గురు ఇద్దరు పిల్లలున్నారు. మరో ముగ్గు మేనమామలున్నా, వాళ్ళు బాగా దూరంగా ఉండేవాళ్ళు. తణుకు వాళ్ళకి మాకంటే బాగా దగ్గర కాబట్టి మాకంటే వాళ్ళు తరచుగా అక్కడికి వచ్చే వాళ్ళు. వెళ్లిన తర్వాత ఎవరిళ్ళకి వెళ్లి ఎవరెవరిని కలుస్తామో, ఏమి ఆటలాడతామో, ఏమి సినిమాలు చూస్తామో అని ఒకటే ఉత్కంఠ.  ఇదికాక తినుబండారాలు, కావలసిన అద్దె పుస్తకాలు, ఓహో ఆభోగం తలచుకొంటే, 1990లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన మా అమ్మమ్మగారు, ఆవిడ మామీద కురిపించిన అవ్యాజమైన ప్రేమ, మనుమలు ఎంత అల్లరి చేసినా ఆవిడొక్కరే అడిగినవన్నీ అమర్చి పెట్టటం, ఎప్పుడైనా విసుక్కోవలసివస్తే ఎంతో అందంగా "లండిక్కి" (అర్థం నాకు తెలియదు) అనటం ఇప్పటికి నా కళ్ళల్లో మెదులుతున్నాయి. శ్రీచాగంటి వారన్నట్టు అమ్మ అంటే రాశీభూతమైన ప్రేమ. అమ్మకి దూరంగా ఉండటం వల్ల , ఈ మాట తలచుకొన్నపుడల్లా మనస్సు ఇంటి వైపుకి మళ్ళుతూ ఉంటుంది. అటువంటిది అమ్మమ్మ అంటే అమ్మకే అమ్మ , ఎంత ప్రేమవుంటుందో చెప్పనలవి కాదు.  తెలియని వయస్సులో ఆవిడని ఏదైనా కావాలని అడిగితే అతి సులభంగా ఎలాగైనా సాధించి చేయగలిగే శక్తిమంతురాలని నమ్మే వాళ్లము.  వయస్సుతో పాటు ఆవిడ శ్రమ, కష్టాలు, బలహీనతలు, భర్త లేకుండా ఆరుగురు పిల్లలని ప్రయోజకుల్ని చేసి, అందరితో మంచి మనిషి అనిపించుకోవటానికి ఎన్ని అవస్థలు పడ్డారో తల్చుకొంటే చాలా బాధ వేస్తుంది. 

ఇంకా తణుకులో ఆటలు, పుస్తకాలు, సినిమాలు, తిండి, పెళ్లిళ్లు , పేరంటాలు, నోములు, వ్రతాలు, అమ్మమ్మ స్నేహితులు, వాళ్ళ పిల్లలు,  ఊళ్లలో వీరవిహారం మాటల్లో చెప్పడం కష్టం. అదీకాకుండా అమ్మమ్మ చుట్టుపక్కల వాళ్ళతో కలసి పనుల్లో చేయి వేయడం, దీపావళికి మతాబులు సిసింద్రీలు చుట్టడం, అసలు అందరితో కలిసి పని చేయడం, పని నేర్చుకోవటం ఎలాగ అన్నది మాపిల్లలకి ఎలా నేర్పించాలో నాకు ఇంకా అంతుబట్టకుండానే వాళ్ళు పెద్దవాళ్లయిపోతున్నారు. . సెలవులు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చేస్తుంటే ఉండే బాధ, బెంగ  మాటల్లో చెప్పటం కష్టం. మేము పిల్లలము ముగ్గురు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా రైలులో వెనక్కి వచ్చేసి, మరో వారం రోజులకు గాని మామూలు మనుషులం కాలేక పోయేవాళ్ళము. అమ్మ పరిస్థితి కూడా అంతే కానీ బయట పడేది కాదనుకొంటా. ఇంటి పనిలో మునిగిపోయేది. అమ్మ అమ్మే!  ఇప్పటికి ఆ స్మృతులు తలచుకొంటే బెంగే కానీ పిల్లలప్పటి తీవ్రత లేదు. ఈ గొడవంతా ఇప్పుడెందుకంటారా? కొద్ది రోజులలో మా ఇండియా యాత్ర మొదలవుతోంది, అందరిని తలుచుకొని మదిలో ఈ కబుర్ల కితకితలు మొదలయ్యాయి. 

28, ఫిబ్రవరి 2018, బుధవారం

నేనెందుకు చదువుతాను?

నాకు ఊహ తెలిసిన తర్వాత (దగ్గర దగ్గర నాలుగేళ్ళపుడు) మాఅమ్మ దగ్గర కూర్చుని అక్షరాలు దిద్దుతూ నేర్చుకొన్న విషయం ఏమిటంటే చదువుకొంటే జీవితంలో వృద్ధిలోకోస్తామని. చదువు, వ్యక్తిగత వృద్ధి నిర్వచనాలు అడగొద్దు. అవి ఒక్కో మనిషికి ఒక్కోక్కలా అన్వయం అవుతాయి లేకపోతే వాళ్ళు ఒక్కోక్కలా అన్వయం చేసుకొంటారు.  నాకు అర్థం అయినదేమిటంటే, దొరికినది దొరికినట్టు చదవటమే. మొదట చిన్న చిన్న కథల పుస్తకాలతో అక్షరాలని కూడపలుక్కుని చదవటం నేర్చుకున్నాను (అమ్మ వెనకాలే ఎక్కడో పనిలో ఉండి గమనిస్తూ ఉండేది, అలాగే  తెలియని పదాల గురించి తెలుసుకోవడానికి మా అమ్మే మొదటి నిఘంటువు). రెండు మూడు తరగతులకొచ్చేటప్పడికి  చందమామ,బాలమిత్ర, బొమ్మరిల్లు చదవటం మొదలయ్యింది. అలాగే వేరే తరగతుల వాళ్ళ వాచకాలు, ఉపవాచకాలు. చుట్టూ పక్కల అంతా తెలుగు మీడియం పిల్లలు తప్ప మరొకళ్ళు లేక పోవటం మా అదృష్టం.  అప్పటికి పుస్తకాల మేత అలవాటయ్యి, ఆకలి పెరిగింది. ఐదో తరగతిలోకి వచ్చేటప్పటికి మానాన్నగారు  ఈనాడు పత్రికకి చందా కట్టి, ఇంటికి తెప్పించటం మొదలెట్టారు. ఆరు, ఏడు  తరగతుల్లో వార, మాస పత్రికలు, డిటెక్టివ్ పుస్తకాలు అలవాటయ్యాయి. ఎనిమిదో తరగతిలో నవలలు నాకు చదువుకోవటానికి అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత స్కూల్ బయట  చదువు గురించి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. మా అమ్మానాన్నకి చదువు మీద ఉన్న అనురక్తి, స్కూలు వేళలో స్కూలు పని, సాయంత్రం ఆడుకొనే వేళలో తప్ప, మిగిలిన వేళల్లో ఇంటి పట్టున ఉండి నీడలో పాఠ్య పుస్తకాలో, వాళ్ళకి తెలియకుండా వేరే పుస్తకాలో చదువుకోగలగటం మరో అదృష్టం. పెద్ద తరగతుల్లోకి వెళ్లిన తర్వాత క్లాసు పుస్తకాలు చదవవలసిన వత్తిడి ఉన్నా, వేరేవి చదివినా మా అమ్మానాన్నలు చూసి చూడనట్టు ఉండేవాళ్ళు.

జీవితంలో నేను ఇప్పటిదాకా మత్తులోని ఎత్తుని నాలుగైదు మార్గాల్లో రుచి చూసాను (దీన్ని ఇంగ్లీషువాడు "getting high" అంటాడనుకొంటాను). వాటిలో ఒకటి రెండు ప్రస్తావిస్తాను.  మొదటిది తిండి. ఆంధ్రుడైనందుకు, ఆవకాయ, గోంగూర పచ్చడి, మిరపకాయ బజ్జి, మినపట్లు, పెసరట్లు మొదలైన వాటిలో మత్తు చూసాను. అవి తల్చుకొన్న వెంటనే నోరు, మెదడు ఆ రుచులు కోరుతాయి. రెండోది, గెలుపు. ఏదైనా పరీక్షలో మొదటివాడిగా నిలబడితే వచ్చే కిక్కు. ఆ మజాని మాటల్లో చెప్పటం కష్టం. అలాంటిదే మంచి పుస్తకం చదవటంలో ఉండే ఆనందం. ఈ రకం మత్తుని  నెమరువేసుకొని, నెమరువేసుకొని అనుభవించాలనిపిస్తుంది. అన్నింటి లాగే ఇందులోనూ అతి ఎక్కువైతే కళ్ళు నెప్పెట్టడం, తల బరువెక్కడం, మనస్సు అలిసిపోవటం, కొన్నాళ్ళు వీటికి దూరంగా పారిపోతే బావుందనిపిస్తుంది. బహుశా అందుకనే అన్ని ప్రక్రియల్లోను కొంత విరామమిచ్చి, మళ్ళి సాధన చేసుకోమని పెద్దలు సలహా ఇచ్చిన్నట్టున్నారు.  ఒక పుస్తకాన్ని తీసుకుని అది ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చలేదో చెప్తే పని సులభమవుతుంది. అయితే అది పుస్తక సమీక్ష అవుతుంది కానీ నేను చెప్పదలుచుకున్నది పూర్తిగా చెప్పబడదేమో? అలాగే నేను చదివిన కొన్ని పుస్తకాలని అరువుతెచ్చుకున్నా, అందరు పాఠకులు అవి చదివి ఉండాలని లేదు.  అయినా మరో మార్గాంతరం లేక అదే పద్దతిలో, అతి చిన్న భాగాలుగా విడదీసి వివరణ ఇస్తున్నాను.

భావోద్వేగాలు:
మొదటిది మనలో ఉండే భావోద్వేగాలని తట్టి  లేపి, మనల్నికూర్చోనివ్వక, నుంచోనివ్వక, మనస్సుని ఏపని మీద దృష్టి పెట్టకుండా చేసేది. ఇది వయస్సుతో పాటు సహజంగా మారే విషయం. మనలో చాలా మంది చిన్నతనంలో సర్కస్సులకి వెళ్లినవాళ్ళమే. Tight Rope Walk అని ఒక ప్రదర్శన అందరు చూసిందే అయ్యుంటుంది. రెండు కొయ్య స్తంభాలని పాతి, వాటి పైభాగాలని ఒక ఇనపతీగతో కలిపి బిగించి కడతారు.  రెండు కొయ్యలకి నిచ్చెనలని అమర్చి,  వాటి ద్వారా పైదాకా వెళ్లి, ఒక చిన్న పిల్లనో, పిల్లాడినో ఆ తీగ మీద ఏ ఆధారం లేకుండా నడిపిస్తారు. ఆ మనిషి ఒక వైపు నుంచి మరో వైపుకి నడుస్తున్నంత సేపు, ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తూంటారు. ఒక్కసారి అవతలకి చేరుకోగానే, ఊపిరి వదులుతారు. పడిపోతారేమో అని పిల్లలం సీటు చివరికంత కూర్చుని, కళ్ళార్పకుండా చూసేవాళ్ళం. ఎవరైనా పడితే, పైకి లేచి ఏమైనా అయ్యిందా అని ఆదుర్దాగా చూసే వాళ్ళము. క్రింద వల అనేది ఒకటి ఉంటుందని తరవాత తెలిసింది. అలాగే ఏదైనా పుస్తకంలో లీనమై చదువుతుంటే, కాలం తెలియదు, ఒళ్ళు తెలియదు, ప్రక్కన వారి స్పృహ ఉండదు.

ఒకసారి ఏదో పోటీ పరీక్ష కోసం ఢిల్లీ వెళ్లి తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎక్సప్రెస్లో హైదరాబాద్ తిరిగివస్తున్నాను. అప్పట్లో టైం మన చేతిలో కాక రైల్వేవాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల, ఎక్కడికి వెళ్లినా కూడా పుస్తకాలు వేసుకొని ప్రయాణం చేయటం అలవాటు. నాకు పైన ఉన్న బెర్త్ దొరికింది (టూ టైర్ బోగి అని గుర్తు). అది రోజున్నర ప్రయాణం. పానుగంటివారి సాక్షి వ్యాసాలు చదువుతున్నాను. నాకు ఎదురుగా ఒక మార్వాడి (నాకెలా తెలుసు అన్నది మరో పెద్ద కథ. స్వతంత్ర భారతంలో ఒక్క రైలు ప్రయాణంలో మొత్తం ఒక కుటుంబం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవచ్చు) అన్న చెల్లి, నా బెర్త్ క్రింద ఒక తెలుగు పెద్దావిడ తోటి ప్రయాణీకులు. అప్పుడు నాకు 21 ఏళ్ళు, ఆ పిల్లకి 17, 18 ఉంటాయేమో. అన్నగారు 24 లేక 25 ఏళ్ళ వాడు అయిఉండవచ్చు. పెద్దావిడకి ఒక 50 సంవత్సరాల వయస్సుండవచ్చు. పుస్తకంలో రచయిత వ్యంగ్యానికి నాకు ఒకటే ముసిముసి నవ్వులు, గట్టిగా నవ్వితే ప్రక్కన వాళ్ళు ఏమి అనుకొంటారో అని భయం (ఆ అమ్మాయి అందంగా ఉండటం, నేను కొన్ని సార్లు దొంగచూపులు చూడటం కూడా మరో నిజం. అపార్థాలకు అవకాశం ఎక్కువ) . అప్పటికి అన్నగారు ఒక కంట నన్ను గమనిస్తున్నారు. ఒక రెండు, మూడు గంటలు అదే పరిస్థితి. ఇక లాభం లేదనుకొని ఒక ద్వారం తలుపు దగ్గిర చతికిలపడి చదువుకొన్నాను.

ఊహాగానాలు:
నా తరంలో, అంటే 80వ దశకంలో కాలేజీలలో ఉన్నవాళ్ళకి,  చదవటం (పాఠ్య పుస్తకాలు కాకుండా) అలవాటు ఉన్న వాళ్లకి అన్ని పత్రికల్లో సీరియళ్ల తాకిడి తెలిసే ఉంటుంది. ఈనాడు దినపత్రికలో, మూడో పేజీలో వచ్చే బొమ్మల కథల కోసం నేను, మాతమ్ముడు, మా చెల్లెలు దెబ్బలాడుకొనేవాళ్ళం.  ఆవేళ కథ చదివిన తర్వాత, రేపు ఏమి జరుగుతుంది అన్నది ఒక్కోసారి తెగేది కాదు. మా అమ్మో, నాన్నో అక్కడి నుంచి మమ్మల్ని తప్పించేదాకా ఇదే తంతు. నేను ఇంటర్లోకి వచ్చేటప్పటికి, ఉదయము పత్రికలో "అశ్వభారతం" ధారావాహిక క్రింద వచ్చేది. దానికోసం ప్రొద్దున్నే పడిగాపులు కాసేవాడిని. రేపేమి జరగబోతోందో అన్న ఉత్కంఠ ఆపుకోవటం కష్టంగా ఉండేది. ఇవికాక షాడో ఇస్తాంబుల్ లోనో, కాబూల్లోనో గూఢచర్యం చేస్తున్నాడనుకోండి, ఒకసారి కళ్ళు మూసుకొని ఊహ చేయండి.  సూపర్ స్టార్ కృష్ణనో, రజనీనో ఆయా ప్రదేశాలలో కథానాయికతో వెళ్ళి ఒక్క ఆయుధం కూడా లేకుండా విరోధులు అందర్నీ పచ్చడి చేసి, సింగపూర్ ప్రధానితో నీ వల్లే మాదేశం కాపాడబడిందని అనిపించుకుని, అమెరికా ప్రెసిడెంట్తో మెడల్ వేయించుకొని ఢిల్లీలో తేలుతారు అనుకోండి. (ఏమిటి ఇస్తాంబుల్, కాబూల్, సింగపూర్, అమెరికా సిటీ బస్సు స్టాపుల అనకండి, బాండ్ చేయగలిగితే షాడో కూడా చేయగలడు. కృష్ణ, రజని తెలియదా? మహేష్ బాబు, జూనియర్ ఏంటోడు తెలుసా,  అయితే వాళ్లనే షాడో అనుకోండి, ఒక పనయిపోతుంది). కంగారు పడొద్దు. పుస్తకం ఎన్ని సిన్మాలనయినా మన మస్తిష్కంలో చూపగలదు.  నాకైతే టీవీలు, ఇంటర్నెట్ రాకముందు పుస్తకాలే లోకం, అందునా పురాణ కథలో, జానపద కథలో చదువుతుంటే పదునాల్గు భువనాలు తిరిగివచ్చే వీలుండేది.

భాషాభివృద్ది:
ఏదైనా ఒక నైపుణ్యం పొందడం గురించి ఒక రచయిత ఇలా అంటాడు. "ఆ విషయం చదవటం, అర్థం చేసుకొని మననం చేయటం, పునశ్చరణ చేయటం - ఇవే మనల్ని అభివృద్ధి పథంలోకి నడుపుతాయి". భాషకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.  చదువుతూంటే క్రొత్త పదాలు, ప్రయోగాలు, నుడికారం, సామెతలు, మాండలీకాలు మనం ఇల్లు కదలకుండా తెలిసికోవచ్చు. ఏదైనాతెలుగులో క్రొత్తది నేర్చుకొంటే, ఆఉత్సాహం మరోలా ఉంటుంది (ఆ కిక్కె వేరబ్బా!). నాకు ఎనిమిది యేళ్ళ అప్పుడు, ఒకసారి  "మన పాత ఇంటి దగ్గర నివసించేవాడు ఇప్పుడు ముందున్న రహదారిపై పోవుచున్నాడు" అని మాఅమ్మతో అన్నాను.  అప్పట్లో మాఇంటికి ఎవరు బంధువులు  వచ్చినా, మా అమ్మ అందరికి చెప్పి, నవ్వి అందరిని నవ్వించేది. నేను ఉడుక్కునేవాడిని. పుస్తకాల ప్రభావం అంతలా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అవికాకుండా, మనుషులు, వారి యాస/గోస, ప్రాంతీయత, చరిత్ర, ప్రదేశాలు, విజ్ఞానం ఒకటేమిటి అసలు కోర్కె ఉంటె, సమస్తనాగరికత పరిణామం అంతా పుస్తకాలలోంచి గ్రహించవచ్చు. ముఖ్యంగా ప్రఖ్యాతినొందిన ఏ రచయిత దగ్గరైనా చిన్న చిన్న పదాలతో అత్యంత ప్రభావకరమైన వాక్యాలు రావటం గమనించవచ్చు. కొందరి వ్రాతలు చదివి చదివి, ఎన్ని సార్లైనా వాటిలో రసాన్ని పిండుకుని, త్రాగి త్రాగి ఆస్వాదించవచ్చు. ఇది నేను తరచూ చేస్తుండే పనుల్లో ఒకటి. మచ్చుకకి "ఏ జాతి చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడనపరాయణత్వం",  "ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలపరా నీ తల్లి నిండు గౌరవము", "జయ జయ భారత జనయిత్రి దివ్యగాత్రి" - ఇవి వింటే మీకు ఆవేశం, పొంగు రావటంల్లేదు? ఇందులో కష్టమైన పదాలూ ఏమీలేవు కానీ ఎంత అర్థవంతమైన, సారవంతమైన, ప్రోత్సాహకరమైన వాక్యాలు. ఎలాగూ వాటిని ఆచరణలో పెట్టం, కనీసం చదివి, నాజాతి ఇటువంటి రచయితలనిచ్చిందని పొంగిపోదాం.

సృజనాత్మకత:
దీని గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని పూర్తి చేస్తాను. నేను గత రెండు మూడేళ్ళుగా రోజులో కొంత సమయం తెలుగు బ్లాగ్లు చదవడానికి కేటాయిస్తున్నాను. ప్రతి రోజు ఇది బావుంది అనేవి ఒకటో రెండో ఉంటాయి. వాటికి నా మనఃస్థితిని బట్టి కామెంట్స్ పెడదామనుకొంటాను. కానీ వ్రాయడానికి వచ్చేసరికి, బావుంది, కెవ్వు కేక, వావ్, అదిరింది, చక్కగా ఉంది. ఇంతే గుర్తుకొచ్చేది, కొన్ని సార్లు వ్రాసిన విషయం ప్రస్తావించి ఏదో ఉద్ధరిద్దామని బయలుదేరితే బద్ధకం అడ్డు. అది కూడా దాటితే ఒకే బాణీలో వ్రాసినవి మరి కొన్ని వ్రాయటం ఇష్టం లేదు. సంతృప్తి లేదు. అదే శ్రీశ్రీగారిది "రివ్యూలు, ప్రివ్యూలు" అన్న పుస్తకం చదివిన తర్వాత ఆయనని మహాకవి అని ఎందుకన్నారో నాకు అర్థం అయ్యింది. వారి రివ్యూలు ఒక రకంగా కామెంట్స్ వ్రాయటం లాంటిదే. ఫలానాకథలో నాగమణి ఎందుకు నవ్విందో కాకుండా, కథ గురించి చెప్పి పూర్తిగా చెప్పకుండా, వాడిన పదాన్ని మళ్ళి వాడకుండా, ప్రతీది క్రొత్త పంథాలో చెప్పటం కొన్ని పదుల పుస్తకాలకి ముందు మాట వ్రాయటం ద్వారా ఆయనకే చెల్లింది. నావరకు  సృజనాత్మకతకి అదే తారాస్థాయి, అదే కొలమానం.  నేను చదివిన వారు, చదవని వారు ఇల్లాంటి ఆణిముత్యాలని మనకందించిన కవులు ఆంధ్ర దేశంలో ఎంతో మంది ఉన్నారు.  ఒక శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రీ, ఒక విశ్వనాథ, ఒక చలం, ఒక మల్లాది రామకృష్ణశాస్త్రి, వీరంతా కారణజన్ములు, అక్షర బ్రహ్మలు, ఋషులు, ఈ పరంపరకు అంతు లేదు, ఇది నిరంతర జీవధార.  వీరందరిని ఎప్పుడు తలుచుకున్నా తనువు పులకరించిపోతుంది.

ఆత్మసంతృప్తి:
ఇది అన్నింటిలోకి ముఖ్యమైనది.  అన్నిసార్లు ఏదో తెలుసుకోవటానికి,  నేర్చుకోవటానికి మాత్రమే కాదు, ఊరికినే చదవటం అనే క్రియ ద్వారా ఆనందం పొందొచ్చు. యండమూరి వీరేంద్రనాథ్ గారి పుస్తకాలు కొన్ని పదుల సార్లు చదివి ఉంటాను. ఇప్పటికి ఎప్పుడైనా మనస్సు బాగోకపోతే నా దగ్గర ఉన్నచదివిన వైవి పుస్తకాలలో, ఏదో ఒక పుస్తకంతోనే స్వాంతన పొందుతాను. అందులో ఏముంది, యువతలో ఉద్రేకం, రక్తం పొంగించే ఉత్ప్రేరకాలు తప్ప అంటారా? అది నిజమే అయుండచ్చు కానీ చిన్ననాటి కొన్ని మధుర స్మృతుల్ని అవి నిద్దర లేపుతాయి, మనసు కుదుటపడుతుంది. ఇంత కంటే సాహిత్యానికి ఉన్న పరమ ప్రయోజనం ఏమిటి?  శ్రీమద్భాగవతంలో వామనావతార ఘట్టంలో  ఒక చిన్న సన్నివేశం ఉంది (http://www.telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76 - అష్టమ స్కంధం, 592వ పద్యం). గురువు గారు వద్దన్నా బలి చక్రవర్తి  వామనమూర్తికి దానం చేయటానికి సన్నద్ధుడు అవుతాడు. గురువు అబద్దం చెప్పమంటారు, బలి చెప్పనంటాడు. బలి రాజ్యం కోల్పోతాడు కానీ మాట తప్పడానికి ఒప్పుకోడు. బలిలోని అహం నాకు నచ్చుతుంది ( ఈ వాదన తప్పయినా, నావరకు నాకిదే ఒప్పు అనిపిస్తుంది. బహుశా నా గతజన్మలలో ఎప్పుడో బలి పరివారంలో పనిచేసి ఉండిఉంటానేమో!) ఎన్ని సార్లు చదివినా ఈ పద్యం, భావం నిత్య నూతనంగా, అత్యంత మానవ సహజంగా  ఉంటుంది. దీంట్లోని మూడుపాత్రలలోని నీతి గ్రహించి కొన్ని ఆదర్శాలను మనకి అన్వయించుకోవచ్చు. ఇటువంటి దృష్టాంతాలు పోతన గారి భాగవతంలో కోకొల్లలు. మీకు కవిత్వంలో అనురక్తి ఉంటె, పద్యాలలోని శబ్దం చెవులకి సంగీతాన్ని, కళ్ళకి చిత్రాల్ని, హృదయానికి అలౌకికానందాన్ని వెనువెంటనే ఇచ్చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటె మన కర్మభూమిలో దాని అభ్యసించాలంటే గురువుకి, వాఙ్మయానికి కొరత లేదు. మంచికి, చెడుకి ఉన్న విచక్షణ తెలియజెప్పడానికి పుస్తకం కంటే మెరుగైన సాధనం నాదృష్టిలో లేదు.

ఈ సంగతి మీద ఎంతైనా వ్రాయొచ్చు, అంతు దరి లేదు. గరికపాటి వారు చెప్పినట్టు అన్ని (ఫిక్షన్, నాన్ ఫిక్షన్) చదవండి, మీకు మీరుగా తప్పొప్పులు నిర్థారించుకోండి . చివరగా వీటన్నింటినుంచి నేను కూడా ప్రేరణ పొంది, రచనలు చేసి, పైన చెప్పిన ఋషుల ఋణం తీర్చుకోవాలనిపిస్తుంది. నేనేదో  సృష్టి చేయడానికి బయలుదేరినవాడినని అనుకోవద్దు. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది ఋషి హృదయం చెడకుండా చెప్పగలిగితే నేను కృతార్థుడనే. పూర్వులు మనకందించినది మనం పాటించి తరవాత తరానికి మన అనుభవం తెలిచేస్తే చాలు అని నా అభిప్రాయం. ఈ సంపదని నాశనం చేయకుండా యదాతథంగా అందిస్తే మన పని మనం పూర్తిచేసినట్టే. మా గురువులు అన్నట్టు - ఎందుకు దేవుడిని పూజించాలి అంటే పూజించకుండా ఉండలేక. ఎందుకు చదవాలి అన్న ప్రశ్నకి చదవకుండా ఉండలేక అన్నది సరైన జవాబు (ఇది నా కల్పితం). ఇప్పుడున్న పరిస్థితులలో పుస్తకం కొనుక్కుని చదివే వాళ్ళు తగ్గేరు. కానీ కొనుక్కోకుండా చదివే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి (లైబ్రరీలు, ఇంటర్నెట్). అందుకని చదవడం అందరికి మంచి వ్యసనం. మీరు దానికి చిక్కుకోండి, మరింత మందిని దానికి చిక్కించండి. శుభం భూయాత్!!!






21, డిసెంబర్ 2017, గురువారం

విదేశాలలో ఉద్యోగ పర్వం!

చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళకి, లేకపోతే బయటి  దేశాలలో ఇతర ఉద్యోగాలలో పనిచేసే వాళ్ళకి తరచూ ఎదురయ్యే ప్రశ్న - ఏమి నేర్చుకొంటే వెంటనే ఉత్తర అమెరికాలోనో, యూరోపులోనో, ఆస్ట్రేలియాలోనో ఉద్యోగం వస్తుంది అని? త్వరపడి ఇంత చిన్న ప్రశ్నకి సమాధానం తెలియదా అనకండి. అడిగేవాళ్ళు నిజంగా తెలియక అడిగితే  ఇబ్బంది లేదు. అదే తెలిసి అడిగారనుకోండి, ఇది బ్రహ్మ పదార్ధం కంటే క్లిష్టమైన ప్రశ్న. ఇంకో మధ్య రకం వాళ్ళు అంటే అటు ఇటు చెందని వాళ్ళుంటారు. వాళ్ళు అడిగితే ఎలాగో ఒకలా సమాధానం చెప్పొచ్చు. 

ప్రతివాడికి విద్యార్ధి దశనుంచి, ఉద్యోగస్తుడయ్యే క్రమంలో కొద్దో గొప్పో సమస్యలుంటాయి. వాటిని దాటుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరి మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కి చివరికి పదవి విరమణ చేస్తాడు. ఈ పరిణామంలో ఎన్నో దశలు, వాటిలో కష్టాలు నష్టాలు చవి చూసి ఎంతో కొంత నేర్చుకుని, అనుభవం, ధనం సంపాదించి ఉద్యోగరుణం తీర్చుకొంటాడు. అలాగే ఆ దారిలో ఎందరి నుంచే సహాయం పొంది, తానూ సుఖపడి, మరికొందరికి తన చేయి అందించి వాళ్ళని పైకి తీసుకొచ్చి మనిషిగా తన కర్తవ్యం కూడా నెరవేరుస్తాడు. అందులో కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. ఎవరు స్వతహాగా ఇంకొకరిని పనికట్టుకొని నిరుత్సాహపరుస్తారని నేననుకోను. కానీ కొన్ని అనుభవాల తర్వాత మన పంథా మారుతుందేమో. కొన్ని సార్లు ప్రశ్నలు అడిగే వాళ్ళ లక్ష్యం ఏమిటో కూడా అర్థం కాదు. గూగుల్ తల్లి ప్రవేశం జరిగిన తరువాత, ఈ తరహా ప్రశ్నలు అడుగుతారా అని మీకనిపించవచ్చు. కానీ అడిగేవాళ్ళు ఉన్నారు.

సరియైన అర్హతలు, చదువు ఉండి అసలు ఏమి తెలియని వాళ్ళు: 

ప్రశ్న: బావ, ఇప్పుడు ఏది మార్కెట్లో హాట్గా ఉంది?
జవాబు: ఏదైనా ఒక రిలేషనల్ డేటాబేస్, ఒక వెబ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఎక్కడో అక్కడ జాబ్లో చేరొచ్చు.
ప్రశ్న: అయితే ఒరాకిల్, సీక్వెల్, మైసీక్వెల్ లలో ఏది నేర్చుకుంటే బావుంటుంది?
 ఏదైనా ఒకటి బాగా నేర్చుకొంటే చాలు
ప్రశ్న: అయితే ఒరాకిల్ నేర్చుకుంటే ఫర్వాలేదా?
జవాబు: ఆఁ  అది సరిపోతుంది.
ప్రశ్న: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే బావుంటుంది?
జవాబు: జావా, సి#, సి++ వీటిలో ఏదైనా ఒకటి బాగానే ఉంటుంది.
ప్రశ్న: వీటిలో ఏది సులభం?
జవాబు: మొదటి రెండిట్లో ఏదైనా ఒకటి కొంత శ్రమతో నేర్చుకోవచ్చు,

వీటితో ఆ జీవుడు ఏదైనా తెలుసుకొని, నేర్చుకొని, బాగుపడితే అంత కన్నా కావలసినది ఏమి ఉంది.

సరియైన అర్హతలు, చదువు ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు: 

ప్రశ్న:అన్నా, ఇప్పుడు ఏది మార్కెట్లో హాట్గా ఉంది (అంటే అతి తక్కువ నైపుణ్యంతో అతి ఎక్కువ జీతం సంపాదించడం ఎలా అని అన్వయం చేసుకోవాలి) ?
జవాబు: ఏదైనా ఒక రిలేషనల్ డేటాబేస్, ఒక వెబ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే ఎక్కడో అక్కడ జాబ్లో చేరొచ్చు.
ప్రశ్న: అయితే ఒరాకిల్, సీక్వెల్, మైసీక్వెల్ లలో ఏది నేర్చుకుంటే బావుంటుంది?
జవాబు: ఏదైనా ఒకటి బాగా నేర్చుకొంటే చాలు
ప్రశ్న: అయితే ఒరాకిల్ నేర్చుకుంటే ఫర్వాలేదా?
జవాబు: ఆఁ  అది సరిపోతుంది.
ప్రశ్న: అయితే సీక్వెల్, మైసీక్వెలకి జాబ్ రాదంటావు?
జవాబు: లేదు. వాటికైనా వస్తుంది. కొన్ని రకాల జంటలకి ఉన్న ప్రాముఖ్యం మరికొన్నింటికి ఉండదు. అంతే కానీ ఇదే నేర్చుకొంటేనే జాబ్ దొరుకుతుందని నాఉద్దేశం కాదు.
ప్రశ్న: ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే బావుంటుంది?
జవాబు: జావా, సి#, సి++ వీటిలో ఏదైనా ఒకటి బాగానే ఉంటుంది.
ప్రశ్న: అదేంటి మొన్న మా కజిన్ పైథాన్, రూబీకి మార్కెట్ బావుంది మిగిలినవాటికి జాబ్స్ కొన్నే ఉన్నాయన్నారు?
జవాబు: ఒక్కో చోట ఉన్న పరిశ్రమలని బట్టి డిమాండ్ ఒక్కో రకంగా ఉంటుంది. వీటికి ఎక్కువ, వాటికి తక్కువ అనుకోవక్కరలేదు. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిగ్గా నేర్చుకొంటే మిగిలినవి సులభంగానే గ్రహించవచ్చు అందుకని వాటి గురించి అంత చర్చ అక్కరలేదు.
ప్రశ్న: ఏది నేర్చుకొంటే ఎక్కువ జీతము వస్తుంది?
జవాబు: (నా మనస్సులో...  ముందు ప్రశ్నకి సమాధానం చూడరా మూర్ఖుడా!). ఇది ప్రదేశాన్ని బట్టి, కంపెనీని బట్టి మరి కొన్ని కారణాల వల్ల ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది.
ప్రశ్న: నీకు వీటి గురించి అంత బాగా తెలియదనుకొంటా?
జవాబు: అవును. (మనస్సులో...  జీతంతో పాటు కాఫీ టిఫిన్ పెట్టి, కాళ్ళు చేతులు నొక్కుతారా అని అడగలేదు)

హమ్మయ్య, వీడు ఇక్కడ నన్ను వదిలేసాడు కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే నేను భూలోకంలోనే నరకలోక శిక్షలన్నీ ఇప్పుడే అనుభవించేవాడిని. ఇదే బాపతు మనకి (అంటే బయట ఉద్యోగాలు చేసే వాళ్ళకి) డబ్బులు ఎలా సులభంగా సంపాదించాలి, పైకి ఎలా యెగప్రాకాలి, విదేశీ పౌరసత్వం ఎలా వెంటనే సంపాదించుకోవాలి లాంటి కిటుకులు చాలా ఉచితంగా ఇస్తారు.

అన్నీ కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు:

వీళ్ళు పై తరగతిలో వాళ్ళలా లౌక్యం లేకుండా అటువంటి ప్రశ్నలే అడుగుతారు. వీళ్ళకి చెప్పటం, ఒప్పించటం కొంచెం సులభమే.

ఏమి తెలియని సామాన్యులు: 

సోడా షాప్ ఓనర్(సోషాఓ): నువ్వు ఎక్కడ ఉంటావు?
నేను: సీడర్ రాపిడ్స్, అయోవా, అమెరికా.
సోషాఓ: అదెక్కడ?
నేను: చికాగో నుంచి పశ్చిమానికి 4 గంటల కారుప్రయాణం.
సోషాఓ: మా దూరపు బంధువు చికాగోలోనే ఉంటాడు.
నేను: చికాగోలో ఎక్కడ ఉంటాడు?
సోషాఓ: ఏమో చికాగోలో ఉంటాడు. నీ జీతమెంత (నాకు తెలుసు మీరైతే ఈ ప్రశ్న అడగరు, కానీ ముందే చెప్పా కదా, సామాన్యుడికి ఈ బాధ లేదు) ?
నేను:  (మనస్సులో... లెక్కలు) సుమారుగా సంవత్సరానికి 17 లక్షల రూపాయలు.
సోషాఓ: అబ్బో ఒక పదిహేను లక్షలయినా మిగలవా?
నేను: మిగలవు. యేవో రకరకాల ఖర్చుల చిట్టా విప్పి చెప్పేను.  (అతనికి అర్థం అయిన్దనుకోను).
సోషాఓ: సరే నన్ను కూడా నీతో తీసుకోపోరాదా? ఏఉద్యోగమైన చేస్తా.
నేను: ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని పోలేము. దానికి పెద్ద తతంగం ఉంది.
సోషాఓ: అయితే నీప్రయత్నం మొదలుపెట్టు, యెంత త్వరగా వీలయితే అంత త్వరగా తీసుకునిపో..
నేను: సరే, చూస్తాను.

ఇది తెలియని అమాయకత్వం కాబట్టి సర్దుకుపోవచ్చు. ఒకవేళ సమాధానం చెప్పలేదనుకోండి, కళ్ళు నెత్తికెక్కాయంటారు. చెప్పారనుకోండి, వాళ్ళకు నచ్చదు కాబట్టి, వీడికి చేతకాదంటారు. ఏదైనా గట్టిగా మాట్లాడితే మదమెక్కిందంటారు. దీనికి మధ్యేమార్గం లేదు. ఇటువంటివే మన పెరట్లో పెరిగే డబ్బుల చెట్ల గురించి, కాలేజీల గురించి, పెళ్లి సంబంధాల గురించి, వ్యాపారాల గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఊరికినే ఉండగలిగితే ఉత్తమం, లేకపోతే ఎలాతప్పుకు తిరగాలి అన్న మీ అనుభవాలు టపాలలో వ్రాసేయండి.  మేము చదువుకొని ఆనందిస్తాము. 

29, నవంబర్ 2017, బుధవారం

Aping the whites

ముందుగా శీర్షికని ఇంగ్లీషులో వ్రాసినందుకు ఏమి అనుకోకండి. తెల్లవాళ్ళని మక్కికి మక్కి అనుకరించడానికి అని చెప్పటానికి వచ్చిన తిప్పలవి. తెలుసుకొన్న కొన్ని సంగతులు యేభాష సరిగ్గా రాని నాలాంటి వాళ్ళు తెలుగులో చెప్పాలని అనుకోవటం సాహసం అనిపిస్తుంది, అంతలోనే వ్రాయాలన్న పూనిక ముందుకు నడిపిస్తూ ఉంటుంది.  ఆ ప్రయోగం యేభాషలో మొదట నాకు తెలిసిందో దాన్నే యథాతధంగా వాడటం మంచిదనిపించింది. ముఖ్యంగా ఒక భాషాప్రయోగం మూలం తాలూకు అర్థం, బలం, ప్రభావం ఏమాత్రం చెడకుండా, తగ్గకుండా చెప్పాలంటే  అదే భాషలో అవే పదాల సముదాయంతో చెప్పటమే ఒక్కోసారి సరైన మార్గం.

పూర్వము ఏకొద్దిమందో తప్పితే, ఎక్కువమంది ఏ ఊరిలో పుడితే ఆవూరులోనే పెరిగి, అక్కడే జీవితమంతా గడిపి అక్కడే తనువు చాలించటం జరుగుతూ ఉండేది. బహుశా గ్రామాలలో స్వయం సమృద్ధి వల్ల  బయటికి వెళ్లే అవసరం ఉండేది కాదేమో! ఆ తర్వాత కొంత కాలానికి తాలూకా పరిధిలో, జిల్లా పరిధిలో వ్యవహారాలు నడిచేవి. ఆతర్వాత మెల్లగా రాష్ట్రస్థాయికి చేరుకొన్నాయి. మెల్లగా బ్రిటిష్ వాళ్ళ పుణ్యామా అని, బస్సులు, రైళ్లు ఏర్పడి, ప్రజల తిరిగే సామర్థ్యం పెరిగి అన్ని చోట్లకి వెళ్ళటం, ఇతర ప్రాంతాల అలవాట్లు నేర్చుకోవటం, వాటిని వారి స్వంత ప్రాంతాలలోకి తీసుకురావటం జరిగాయి. దీంతో మార్పు అనివార్యమయింది. అన్ని మార్పులు మంచివే అయితే నేనిది వ్రాయనక్కరలేదు. ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచం అన్ని విధాలుగా చిన్నదవుతోంది. దూరాలు దగ్గరవుతున్నాయి. ఎక్కువ భాషలు నేర్చుకొనే అవకాశాలు పెరిగి, నేర్చుకొనే వాళ్ళు పెరుగుతున్నారు. వాటితో అనేక దేశాలకి వెళ్లే అవకాశాలని సద్వినియోగం చేసుకొనే వాళ్ళు పెరిగారు. అక్కడికి వెళ్లి స్థిరపడి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు పెరిగారు.  అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లడం రావడం మామూలయిపోయింది. అన్ని దేశాల తినుబండారాలు అన్ని దేశాల నగరాల్లో, పట్టణాలలో, ఇప్పుడు చిన్న ఊళ్ళలో అందుబాటులోకొచ్చాయి. అలాగే కట్టే బట్టలు, ఫ్యాషన్లు, పాషన్లు, తినే తిళ్ళు, చదివే చదువు, నాగరికత అన్ని ఈరాకపోకలతో ప్రభావితం అవటం మొదలయ్యాయి. చాలా మార్పులు స్వాగతించదగ్గవే. కొన్ని మాత్రం తప్పని సరిగా అభ్యంతరకరమే.

పశ్చిమదేశాలలో  చాలా చోట్ల స్వతంత్రం హింస సహాయంతో సంపాదించినది. వాళ్ళ దైనందిన విషయాల్లోనూ, దృక్పథంలోనూ చాలా విషయాలు దానితోనూ, మధ్య యుగాలలో వాళ్ళ మతంలో వచ్చిన మార్పులతోను బాగా ముడివేసుకొన్నాయనిపిస్తుంది.  తెల్లవాళ్ళకి కుటుంబవ్యవస్థ లేదు, వాళ్ళకి పెళ్లి మీద నమ్మకం లేదు, వాళ్ళకి చదువు రాక మన వాళ్ళని ఉద్యోగాలలోకి తీసుకొంటున్నారు,  వాళ్ళకి స్వప్రయోజనం తప్ప మరోటి లేదు, వాళ్ళు పచ్చి మాంసం తింటారు, ఎప్పుడు మద్యం మత్తులో ఉంటారు, పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోరు ఇలా మరికొన్ని అభిప్రాయాలు చాల మంది భారతీయుల్లో తరచూ వింటూ ఉంటాము. ఈమాటలు పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే ఈ తరహా ధోరణులు మన సంఘంలోనూ  (ఆమాటకొస్తే అన్ని సంఘాలలోనూ, అన్ని దేశాలలోను, అన్ని వేళల ఉన్నాయి, ఉంటాయి, ఎక్కువ తక్కువలే తేడా) ఉన్నాయి. కాకపోతే నిష్పత్తుల విషయంలో వాళ్ళు మనకంటే కాస్త ఎక్కువ చెడు వైపే ఉన్నారు.  బయట నుంచి మనం చెడు ఎంత ఉందనుకొంటున్నామో, లోపల అంతకు కొన్ని రెట్లు మంచి కూడా ఉంది. అన్నిటిలోకి ముఖ్యంగా న్యాయము, చట్టము సంఘంలో ఉన్నసామాన్యులు అందరికి అందుబాటులో ఉండటం విశేషమైన సంగతి. ఇదికాకుండా, అన్య మతాలు, దేశాలు, తెగల వారిని గౌరవించటం, ప్రక్కనవాళ్ళకి సహాయం చేయటం, యోగ్యత ఉన్నవాళ్ళని అందలం ఎక్కించటం, పరిసరాల పరిశుభ్రత, ఆస్తుల పరిరక్షణ, ప్రజలకి సంబందించిన అన్ని ప్రభుత్వ విషయాలని పారదర్శకంగా ఉంచటం, ఎంతటి వారినైనా సహేతుకంగా విమర్శించే  హక్కు, ఎంతటి వారి నైనా తప్పు చేస్తే కోర్టుకి లాగి న్యాయ విచారణ చేయటం, ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పద్దతి ప్రకారం జరగటం జరిపించుకోగలగటం, అధికారంలో ఉన్నవాళ్ళని చూసి ప్రజలు భయపడకపోవటం లాంటివి కొన్ని. వీటిలో కూడా గతకొద్ది సంవత్సరాలుగా కొంత మార్పు వస్తోంది. దురదృష్టవశాత్తు అది చెడువైపుకి పయనం కావటం గమనించవలసిన విషయం. చెడు గురించి ఎంతైనా చెప్పొచ్చు, కానీ అది ఈ వ్యాసానికి ప్రస్తుతం అవసరం కానందున, అలాగే మన మీడియా నిత్యం ఊదరగొట్టేస్తుంది కాబట్టి దాన్నివదిలేస్తున్నాను.

ఇక మనవాళ్ళ దగ్గరకొద్దాము. ముందే అన్నట్టు ఈ విచారణ హెచ్చుతగ్గుల మీదే కానీ పూర్తిగా ఉన్నాయా లేదా అన్న చర్చ గురించి కాదు.  మనకి వేరే వాటితో ప్రమేయం లేకుండా మనవైనవి మాత్రమే అయిన సమస్యలు చాలా ఉన్నాయి. వీటికి తోడు పశ్చిమంనుంచి దిగుమతి చేసుకొని మనకి హానిచేస్తున్న వాటి గురించి ముచ్చటించుకుందాము. అమ్మ దినం, నాన్న దినం, ప్రేమికుల (వాలెంటైన్స్) దినం ఇవన్నీ మనకు కావలసిన దినాలా? పొద్దున్న లేస్తే  మనకి అమ్మని, నాన్నని తలుచుకొని రోజుంటుందా? ఇప్పుడున్న సాధనాల సహాయంతొ, యెంత దూరంగా ఉన్నా వారానికోమాటు వాళ్ళతో మాట్లాడతాము కదా! చక్కగా మంచి, చెడు చూసి పెళ్లిళ్లు చేసే చోట, సహజీవనము, డేటింగ్, పెళ్ళికి ముందు ప్రేమలు మన సంఘానికి అవసరమా? తుమ్మితే ఊడిపోయే ఈ సంబంధాలలో మళ్ళీ ప్రేమికుల దినము ఒకటి పెట్టుకుని పండగ చేసుకోవటం అర్థరహితం. వీటి మూలంగా కుటుంబ సంబంధాలు దెబ్బ తిని, వీధికెక్కి కొట్టుకుని ఆపై కోర్టులకెక్కే వాళ్ళు తరచూ మనకి తారసపడుతూనే ఉంటారు. పొరపాటున ఈతరహా ప్రేమికుల మధ్య పెళ్ళయితే, పెళ్లయినంత త్వరగాను విడాకుల లైన్లలో నిలబడుతున్నారు. ఈ పాపం ఎవరిది? సినిమా వాళ్ళు నిత్యం జనాలకి ఏదో ఒక  క్రొత్త వింత చూపెట్టడం అనే పరిశ్రమలో ఉన్నారు కాబట్టి, మనకి అతికినా అతకక పోయినా ఏదో ఒకటి చూపెడుతుంటారు. అది తెలియని యువత గుడ్డిగా అనుకరించి ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి తలల మీద జుట్టుని రకరకాలుగా తరిగి, వింతైన ఆకారాలతో వెళ్లే మగ కుర్రకారుని నేను హైదరాబాద్ లో చూసాను. ట్రాఫిక్ పోలీసులకి వీళ్ళని చూస్తే బకరా దొరికిందని ఆపడం కొన్ని సార్లు చూసాను. ఆపిన తర్వాత కథ మీకు సుపరిచితం. ఇంకా చాలీ చాలని బట్టలతో బయటికి వచ్చే వాళ్ళు, వాళ్ళని చూపులతో తడిమేవాళ్ళు, వీటితో ఇబ్బందులలోకి  వెళ్లే వాళ్ళు, అఘాయిత్యాలకు గురయ్యేవాళ్ళు  కోకొల్లలు.  అలాగే ఈ అవతారాలతో గుళ్ళల్లో ప్రత్యక్షం, ఇంకేముంది ఆపైన చెప్పుకోవడానికి?  తిండి దగ్గరకొద్దాం. ఇంట్లో తాజాగా కూరగాయలతో ఆరోగ్యకరమైన పదార్థాలు చేసుకొని తినటం అతిత్వరలో అంతరించిపోయే కళల్లో ఒకటి. లడ్లు, సున్ని ఉండలు, కాజాలు ఇలాంటి తినుబండారాలన్నీ మోటు, బోరు. బర్గర్లు, పీజ్జాలు, చాకోలెట్లు, కూల్ డ్రింకులు ముద్దు. దీనికి తోడు వేళాపాళా లేని ఆహారపుటలవాట్లు ప్రబలుతున్నాయి. దీంతో అరవై, డబ్భై సంవత్సరాలలో వచ్చే రోగాలు ఇరవైల్లోనే వచ్చి, మిగిలిన జీవితాలు మందులతో లాగించవలసివస్తోంది. ఇవాళ ఫైనాన్సియల్ ఎక్సప్రెస్లో ఒక వార్త వచ్చింది.  రోడ్ల మీద తినే తిళ్ళలో బర్గర్లు, సమోసాలలో ఏది మెరుగన్న విషయం పరిశీలించి,  రసాయనాలు వాడి నిల్వవుండేలా చేసే బర్గర్ల కన్నా దేశీసమోసాలు ఆరోగ్యానికి మంచివని తేల్చారు. పెరిగే రోగాలతో వచ్చే జనాలని రక్షించటానికి ఉద్యోగులు, మందులు, వైద్యం ఇతరాత్రా రూపేణా ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలో ఆలోచించండి.  వీటిలో చాలా మటుకు మనం అరువుతెచ్చుకున్నవి. ఇవి మన జీవితచట్రంలో సరిగ్గా ఇమడనివి.  నేను స్పృజించినవి కొన్నే, అయినా ఇవి చాలు ప్రమాదఘంటికల తీవ్రత తెలియచేయడానికి.

మన పూర్వులు దార్శనికులు, ముందు చూపుతో మనకున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పద్దతులను ఏర్పాటు చేశారు.  మన వాటికి దూరం జరుగుతూ, పశ్చిమ/తెల్ల వాళ్ళ  పద్దతులకు  దగ్గరయి వాటిని గుడ్డిగా అనుకరిస్తే మన భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారవుతుంది. మంచిని ఎవరి  నుంచైనా,ఎక్కడి నుంచైనా గ్రహించడంలో అభ్యంతరం ఉండదు. తెలిసి మనకి అక్కరకు రాని వాటిని స్వీకరించటంలో అంతరార్థం అర్థం అవ్వదు.  వ్యక్తి స్వతంత్రం కంటే సమాజ శ్రేయస్సు, ప్రజాభద్రత ముఖ్యమనుకొన్న భారతీయ సమాజానికి ఇవన్నీ మునుముందున్న పెను సవాళ్లు. మనం మేలుకుని ఈవిపత్తు నుంచి తప్పించుకొనే ఉపాయం చేయకపోతే భారతీయ సంస్కృతీ అనేది క్రీ.శ. 2000 ప్రాంతంలో ఉండేదట అనే  కాలం ఎంతో దూరంలో లేదు.

26, అక్టోబర్ 2017, గురువారం

కొన్ని నిజాలు/అబద్దాలు?

శ్రీరామాయణంలో రాముల వారు అరణ్యానికి బయలుదేరే సమయంలో ఒక చిన్న విశేషం గురించి చెప్పుకుందాము. దశరథుడు రాముణ్ణి అడవికి వెళ్ళొద్దని పలు విధాలుగా ప్రాధేయపడతాడు. రాముడు తండ్రికి నమస్కరించి, మీ మాటని ఆచరణలో పెట్టడమే నా ధర్మమని చెప్పి సెలవు తీసుకొని అంతఃపురంలోంచి బయలు దేరుతాడు. బయటికి వచ్చి సుమంతుణ్ణి రథాన్ని తీసుకు రమ్మని, సీతాలక్ష్మణులతో కలసి రథంలో బయలుదేరుతాడు. ఇంతలో దశరథుడు మేడమీది నుంచి రాముణ్ణి వెళ్లవద్దని కోరుతాడు. అలాగే సుమంతుణ్ణి రథం ముందుకు తీసుకువెళ్ళద్దని ఆజ్ఞాపిస్తాడు. అయితే రాముడు ముందుకే రథాన్ని నడపమని సుమంతుడికి చెప్తే, సుమంతుడు అలా చేస్తే రాజాజ్ఞని ధిక్కరించినట్టవుతుందని రాముడికి చెబుతాడు. రాముడు రథచక్రాల ధ్వనిలో రాజు మాట వినిపించలేదని చెప్పమని చెబుతాడు. సుమంతుడు అది అబద్దం చెప్పటం కాదా అని ప్రశ్నిస్తే, రాముడు ఒక పెద్ద సత్యాన్ని కాపాడటం కోసం ఒక చిన్న నిరపకారమైన అబద్దం చెప్పటం తప్పు  కాదని చెబుతాడు. ఇది త్రేతాయుగపు ధర్మసూక్ష్మం.  

మహాభారతంలో కురుక్షేత్రంలో యుద్ధం హోరాహోరీగా జరుగుతోంది. గురుదేవులు ద్రోణుల వారి స్వైర విహారానికి పాండవుల పనుపున పోరాడుతున్న వీరులు పిట్టలలా నేల కూలుతున్నారు. ఆయనని నిలువరించడం ఎలాగో పాండవులకు అర్థం కాలేదు. మాములుగానే తరుణోపాయం కోసం కృష్ణభగవానుణ్ణి ప్రార్థించారు. ఆయన ఆచార్యుడి బలహీనతని పాండవులకు వివరించి, మరు రోజు యుద్ధం ఎలా చెయ్యాలో చెప్పాడు. అనుకొన్న విధంగా ధర్మరాజు "అశ్వథామ హతః కుంజరః" అని అనటం, పాండవ సైన్యం జయభేరులు మ్రోగించటం,  ఆ రణగొణధ్వనిలో ద్రోణాచార్యులు పై వాక్యంలోని చివరి భాగం సరిగ్గా వినకపోవడం, తత్ఫలితంగా ఆయన అస్త్ర సన్యాసం చేయటం, ధృష్టద్యుమ్నుడు ఆయన్ని హతమార్చటం వెంట వెంటనే జరిగిపోయాయి. ధర్మరాజుకి ఇదంతా ఇష్టం లేకపోయినా కృష్ణపరమాత్మకి ఎదురు చెప్పలేక ఆయన చెప్పిన వ్యూహం అమలుచేయటం జరిగింది. తదనంతరం స్వర్గారోహణ పర్వంలో పైపనికి తగిన శిక్ష అనుభవించేడు అన్నది మరో ద్వాపర యుగపు కథ. 

ఈమధ్యన లింక్డీన్.కామ్ (www.linkedin.com) అన్న వెబ్సైటులో మాతో పనిచేసి వెళ్ళిపోయిన ఒక తోటి ఉద్యోగి దరఖాస్తు చూశాను.  ఈ సంస్థ అన్ని రకాల ఉద్యోగులకి క్రొత్త అవకాశాలని చూపెట్టడానికి, ఇతర సంస్థలు ఇక్కడనుంచి కావలసిన వాళ్ళని ఎంచుకోవడానికి అనువైన ప్రదేశం అని ప్రచారం చేసుకొంటుంది. నచ్చిన ఉద్యోగులు వారికి సంబందించిన కొంత సమాచారం ఇక్కడ పొందుపరుస్తారు.  నేను పైన చెప్పినాయన మరోచోట డైరెక్టర్గా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, తెలివైన వాడు, సామర్థ్యం ఉన్న యువకుడు. అంత వరకు తప్పేమి లేదు. అయితే ఉన్న అనుభవమంతా క్రింది స్థాయి నుంచి వచ్చినట్టు కాకుండా, చేరడమే ఉన్నత ఉద్యోగిగా చేరినట్టు వ్రాసాడు. అతను చేరటం ట్రైనీగా  మాతో చేరి త్వరత్వరగా ఉద్యోగంలో ఎదిగాడు.  కానీ అదంతా దాచేసి ఏమి ఎవరికి తెలియనట్టు  క్రొత్త చోట మెట్లుఎక్కాలని చూస్తున్నట్టు తెలిసింది. పరిశీలించి చూస్తే ఈ తత్త్వం బాగా యువతలో వృద్ధి చెందుతున్నట్లు అనిపిస్తోంది. దీని వల్ల నిజంగా అనుభవం, నైపుణ్యమున్నవాడికి నష్టం కాదా? లేని అనుభవంతో సంస్థలో అత్యున్నతస్థానంలో ఉండి వీళ్ళు ఎవరికి ఉపకారం చేయగలరు?

కొన్ని వారాల క్రితం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిగారు ఏదో సందర్భంలో ఉద్యోగాలకి ప్రయత్నించే  ఆశావహులు దరఖాస్తుల్లో కొన్ని లేని హంగుల్ని చేర్చటంలో తప్పులేదని వాక్రుచ్చారు. అది కాస్తా పత్రికల్లో కొంత రాద్ధాంతానికి దారి తీసింది. నిరుద్యోగులు ఏదో ఒక వృత్తిలో చేరటానికి, కుదురుకోవటానికి ఆవిడ స్వతంత్రించి ఇచ్చిన సలహా పనికొస్తుంది. చిత్రమేమిటంటే అన్ని సంస్థలు మనం ఇస్తున్న విషయాలు ప్రమాణపూర్వకముగా నిజమని ధ్రువపత్రాలు తీసుకొంటాయి.  అవి నిజం కానీ పక్షంలో మన ఉద్యోగాలు పీకేయడానికి వాటికి హక్కు ఉంది. చట్టపరంగా నేరం కూడాను. అయినా అలా చేసే వాళ్లకి కొదవలేదు. కారుణ్యదృక్పథంతో చూస్తే నిరుద్యోగులు ఏదో విధంగా జీవితంలో స్థిరపడటంలో పెద్ద అభ్యంతరం కనపడదు. అదే పని కొంత అనుభవమున్న వాళ్ళు చేస్తే అనైతికంగాను, ఎబ్బెట్టుగాను, మోసంగాను అనిపిస్తుంది. ఇది కలియుగంలో కథ (మాయ) ఏమో?